Saturday, May 4, 2024

వృద్ధాప్యంలో ఎలా ఉంటారు – అన్న ఫొటోపై ప‌రుచూరి గోపాల‌కృష్ణ స్పంద‌న‌

రీసెంట్ గా ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫొటో చూసి షాక్ అయ్యారు అంతా. గుర్తు ప‌ట్ట‌లేని విధంగా మారిపోయారాయ‌న‌. కాగా ఆయ‌న బాడీలో మార్పుల‌పై ఆయ‌న త‌మ్ముడు ప‌రుచూరి గోపాల‌కృష్ణ స్పందించారు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వ‌చ్చాక ఆయ‌న ఆరోగ్యం విష‌యంలో కొంత తేడా వచ్చిందని, దీంతో పరీక్షలు చేయించుకున్నార‌ని చెప్పారు. ఆహార నియమాలు పాటించాల‌ని వైద్యులు సూచించార‌ని అన్నారు. త‌న అన్న‌య్య దాదాపు 10 కిలోల బ‌రువు తగ్గారని చెప్పారు. ఆయన మేధస్సు మాత్రం అలాగే ఉందన్నారు. జుట్టుకు ఆయ‌న‌ రంగు వేయట్లేద‌ని, ఈ నేప‌థ్యంలోనే ఫొటోలో అలా క‌న‌ప‌డ్డార‌ని చెప్పారు. ఆ ఫొటో షేర్‌ చేసిన జయంత్‌ను ఎందుకు షేర్ చేశావ‌ని అడిగాన‌ని, అలాంటి ఫొటో ఎందుకు పెట్టావ‌ని ప్ర‌శ్నించాన‌ని వివ‌రించారు. ఆ ఫొటో చూసిన అనంత‌రం త‌న అన్న‌య్య‌ జుట్టుకు రంగు ఎందుకు వేసుకోలేదని చాలా మంది అడిగార‌ని… మ‌నిషి 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడని ఆయ‌న అన్నారు. వయసు పెరిగే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయన్నారు.

తాను కూడా 15 కిలోలు త‌గ్గాన‌ని ఆయ‌న చెప్పారు. య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు ఎలా ఉండేవారో వృద్ధాప్యంలోనూ అలాగే క‌న‌ప‌డాల‌ని కొంద‌రు భావిస్తార‌ని చెప్పారు. ఎంజీఆర్ క‌ళ్ల‌జోడు, త‌ల‌పై టోపీ లేకుండా ప్ర‌జ‌ల‌కు ఎన్న‌డూ క‌న‌ప‌డ‌కూడ‌ద‌ని నియమం పెట్టుకుని అలాగే ఉన్నార‌ని ఆయ‌న వివ‌రించారు. శోభ‌న్ బాబు కూడా అలాగే భావించి వృద్ధాప్య ఛాయ‌లు క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని అన్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కూడా మొద‌ట అలాగే భావించార‌ని, కానీ, ఓ సినిమాలో న‌టించిన త‌ర్వాత త‌న అభిప్రాయాన్ని మార్చుకున్నార‌ని చెప్పారు. హీరోలుగా ఉన్న స‌మ‌యంలో ఎలా క‌న‌ప‌డ్డామో జీవితాంతం అలాగే క‌న‌ప‌డాల‌ని కొంద‌రు భావిస్తార‌ని అన్నారు. త‌న అన్న‌య్య వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నో గొప్ప స్క్రీన్ ప్లేలు అందించార‌ని చెప్పారు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న బాగా మాట్లాడుతున్నార‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న అన్న‌య్య ఫొటో చూసిన కొంద‌రు దానిపై స్పందించాల‌ని అడిగార‌ని అందుకే మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. అంద‌రి అభిమానానికి వంద‌నాలు చెబుతున్నాన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement