ఏపీలో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఆయన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంలో 110 కోట్లు ఖర్చు చేసి విమానాశ్రాయన్ని తీసుకొచ్చామని, ఏపీలో ఇది ఆరో ఎయిర్ పోర్ట్ అని సీఎం తెలిపారు. ఇక్కడి నుండి బెంగళూరు, చెన్నై, విశాఖకు విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ఎయిర్ పోర్టులో ఒకేసారి నాలుగు విమానాలను పార్క్ చేసుకునే వీలుందని, అన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించినట్లు సీఎం ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టును సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి పి హర్దీప్సింగ్కు కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్, కేంద్రమంత్రితో కలిసి ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్ జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా.. బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.