Saturday, May 4, 2024

థర్డ్ ఫ్రంట్ అవసరం లేదు.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం

మూడో ఫ్రంట్ అక్కరలేదని, దేశ రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం తిరుమలలో పర్యటనకు వచ్చిన కవిత అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. కెసిఆర్ కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం సంతోషం అని అన్నారు. దేశరాజకీయాల్లోను టిఆర్ఎస్ చక్రం తిప్పుతుందన్నారు. థర్డ్ ఫ్రంట్, ఏ ఫ్రంట్ అవసరం లేదన్న కవిత.. 105స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని బిజెపి తమపై దుష్ర్పచారం చేయడమా ? అని ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.

కాగా, తెలంగాణ సీఎం కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కవిత నిరుపేదలకు అన్నదానం చేశారు. అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమల బయలుదేరి వెళ్లారు. అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు చెల్లించారు. తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని కవిత అన్నారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తాను అని చెప్పారు. అలిపిరి వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు. పాదాలమండపం వద్దకు చేరుకోగానే మనస్సు భక్తిభావంతో నిండిపోయిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement