Sunday, April 28, 2024

నార్సింగి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ల‌ నిర్ల‌క్ష్యం.. టీకా కోసం గంట‌ల‌కొద్దీ నిరీక్షణ‌

హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ప‌రిధిలో ఉండే నార్సింగి రూర‌ల్ హాస్పిట‌ల్లో డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం అంతా ఇంతా కాదు. కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్తలు తీసుకుని టీకాలు వేయిస్తుంటే.. వీరు మాత్రం త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొన్ని హాస్పిట‌ళ్లు టీకాల విష‌యంలో రికార్డులు సృష్టిస్తుంటే.. నార్సింగ్ ఆస్ప‌త్రిలో మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌డం ఇవ్వాల క‌నిపించింది. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి వెళ్లిన సిబ్బంది 2.30 దాటినా ఒక్కరు కూడా తిరిగి డ్యూటీకి రాలేదు.

మ‌ధ్యాహ్నం తాము బుక్ చేసుకున్న వ్యాక్సినేష‌న్ టైమింగ్ ప్ర‌కారం టీకా వేయించుకోవ‌డానికి వ‌చ్చిన వాళ్లంతా ఒంటి గంట నుంచి అక్క‌డ వెయిట్ చేస్తున్నారు. ఇగ వ‌స్తారు, అగ వ‌స్తారు అని ప‌దుల సంఖ్య‌లో జ‌నం క్యూ క‌ట్టి వెయిట్ చేసినా అక్క‌డికి మాత్రం వైద్య సిబ్బంది రాలేదు. పైగా హాస్పిట‌ల్ డోర్లు ఓపెన్ చేసి, వ్యాక్సినేష‌న్ కిట్లు టెబుల్స్‌పై వ‌దిలేసి వెళ్లారు. ఇదంతా చూసిన వారు ఏంటీ వీళ్ల నిర్ల‌క్ష్యం అని చెప్పుకోవ‌డం క‌నిపించింది. కొంత‌మంది సిబ్బంది తీరు వ‌ల్ల ఏకంగా ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు వ‌చ్చేలా ఉంద‌ని చాలా మంది చ‌ర్చించుకున్నారు. ఈ విష‌యాన్ని ఫొటోల‌తో స‌హా మంత్రి కేటీఆర్‌కు, వైద్య ఆరోగ్య శాఖకు ట్వీట్ కూడా చేశారు. మ‌రి ఇలా నిర్ల‌క్ష్యం చేసిన డాక్ట‌ర్లు, సిబ్బందిపై సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని లేకుంటే వీరికి ఇది అలుసుగా మారుతుంద‌ని ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement