Tuesday, May 14, 2024

ప్రాజెక్టుల విషయంలో పేదల గురించి పట్టించుకోని కేరళ సీఎం విజయన్​: కేంద్ర మంత్రి మురళీధరన్​

ప్రాజెక్టుల విషయంలో కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నత వర్గాలతో మాత్రమే మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి వీ మురళీధరన్ ఆరోపించారు. చనగానచేరిలో కె-రైలు ప్రాజెక్టుకు సర్వే, శంకుస్థాపన సందర్భంగా నిరసనకారులపై పోలీసుల క్రూరత్వానికి ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేశారు. నిరసన సమయంలో మహిళా నిరసనకారులపై మగ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. ‘‘కేరళ ప్రభుత్వం సమానత్వం గురించి మాట్లాడుతుంది. మరి మహిళలపై ఈ దాడిని ఎలా సమర్థించుకుంటారు? ప్రజల కోసమే ప్రాజెక్టు అని సీఎం చెబుతున్నారు. ఆయన ప్రస్తావిస్తున్న వ్యక్తులు ఎవరు?’’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. సీఎం పినరయి విజయన్​ని నియంతగా పోలుస్తూ.. కేఈ రైలు విషయంలో ప్రభుత్వ చర్యలు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

రైల్వే శాఖ నుంచి కేవలం డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మరేదీ కాదు.. సీఎం తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని.. ప్రజలను కాదని ఏ ప్రాజెక్టును జరగనివ్వబోమని మంత్రి తెలిపారు. కె-రైల్ నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యంపైనా ప్రతిపక్ష పార్టీ యుడిఎఫ్ కూడా కేరళ అసెంబ్లీలో శుక్రవారం నిరసన చేపట్టింది. ప్లకార్డులు చేతబూని సభ మధ్యలోకి దూసుకెళ్లారు విపక్ష సభ్యులు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. అసెంబ్లీలో ప్లకార్డులు, బ్యానర్లు వాడడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించడం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గేందుకు నిరాకరించి.. తమ తమ స్థానాల్లో నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement