Tuesday, May 14, 2024

‘సెస్‌’ల పేరుతో కేంద్రం దోపిడీ.. టీఆర్ ఎస్ ప్లీన‌రీలో మంత్రి హ‌రీశ్ ఫైర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ నేతలు ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్‌ భారత్‌ అయ్యిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆకలి సూచీల్లో మనం ఎక్కడో ఉన్నామనీ.. పాక్‌, బంగ్లాదేశ్‌ మనకన్నా ముందున్నాయనీ.. ఇది బీజేపీ పాలనా తీరని ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్‌ పూల్‌లోకి తేవాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. జీడీపీలో సెస్‌ల వాటా 12 శాతం దాటిందని, ఇన్నిరోజులుగా సెస్‌లలో వసూలు చేసిన 5 లక్షల కోట్లలో రూ.54 వేల కోట్ల రూపాయలు తెలంగాణ వాటాగా రావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్‌ నిలిపారన్నారు. 14 సంవత్సరాలు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్‌ఎస్‌ అనీ, దేశంలోనే అతిచిన్న వయసు కలిగిన రాష్ట్రమైనా అన్ని రాష్ట్రాలకు దశద్ఖిశ చూపిందన్నారు. సీఎం కేసీఆర్‌ రూపొందించిన ప్రగతిశీల ఎజెండా దేశానికి అవసరమని, పక్క రాష్ట్రాల నుంచి కేసీఆర్‌ ఎజెండా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు.

బలమైన కేంద్రం… బలహీన రాష్ట్రాలే కేంద్రం లక్ష్యం…
రైతుబంధు, దళితబంధు, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ తదితర పథకాలు మకు కావాలని పక్క రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారని, సీఎం ఆలోచనలు, చిన్న పాలసీలు ఎన్నో గుణాత్మక మార్పునకు నాందిపలికాయన్నారు. పల్లె ప్రగతి, పట్ణ ప్రగతి అద్భుతమైన ఆలోచనతో స్థానిక సంస్థలను బలోపేతం చేసి, నిధులు, విధులు, ఉద్యోగాలు కల్పించి రూ.13వేల కోట్లు ఇస్తే దేశంలో సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన కింద పదికి పది తెలంగా గ్రామాలు మొదటి స్థానంలో ఉన్నాయంటే ఎంత అభివృద్ధి, ఎంతో అద్భుత ఫలితాలు సాధించామన్నారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించామన్నారు. కేంద ప్రభుత్వ సిద్ధాంతం ఏంటంటే.. ‘కేంద్రం బలంగా ఉండాలి. రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనంగా ఉండాలి. రాష్ట్రాలకు అధికారాలను తగ్గించాలి’ ఇదే కేంద్రం సిద్ధాంతమన్నారు. రాష్ట్రాలు కేంద్రం చెప్పు చేతల్లో ఉండాలని చేస్తోన్న ప్రయత్నం ఇదని మండపిడ్డారు.

బీజేపీ ప్రభుత్వానిది వైఫల్యాల చరిత్ర
బీజేపీ ప్రభుత్వానిది వైఫల్యాల చరిత్ర అనీ, తెలంగాణ ప్రభుత్వానిది సాఫల్యాల చరిత్ర అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్‌, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో సాధించిన అద్భుత ఫలితాలు, ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో కానే కాదనీ, గోదావరి నీళ్లు రావన్నారన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ పట్టుబట్టి రాత్రింభవళ్లు పని చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీళ్లు ఇస్తున్నామని, తెలంగాణ అంతా సస్యశ్యామలమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే 99లక్షల టన్నుల ధాన్యం పండితే ఇప్పుడు 2.50 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కేంద్రానికి వైఫల్యాల చరిత్ర అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాటలు మాట్లాడుతుందని, ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటుపడిపోయిందని, ఆ నాడు 8శాతం ఉంటే ఇవాళ 5.7శాతానికి పడిపోయిందన్నారు.

బీజేపీ ధరలు పెంచి, మతకల్లోలాలు సష్టించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అచ్చేదిన్‌ అన్నారు.. కానీ ప్రజలకు చచ్చేదిన్‌ చేశారని ఆరోపించారు. నల్లధనం తెస్తామని చెప్పి.. రైతాంగానికి నల్ల చట్టాలు తెచ్చారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టారనీ.. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ.. ఊడగొడుతున్నారని మండిపడ్డారు. కొత్త పరిశ్రమలు తెస్తామని చెప్పి.. ఉన్న వాటిని అమ్ముకుంటున్నారని, బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వరంగ సంస్థల విలువ మూడున్నరలక్షల కోట్లని పేర్కొన్నారు. మోదీ చాయ్‌ అమ్మిండని.. బుల్లెట్‌ ట్రైన్లు తెస్తామన్నారని.. కానీ వాస్తవానికి రైళ్లు, రైల్వేస్టేషన్లు జరుగుతున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాక ముందు నిరుద్యోగం 4.7 శాతం ఉంటే, ఏడేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం 7.11 శాతానికి పెరిగిందన్నారు. పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారనీ.. జన్‌ధన్‌ ఖాతాలన్నారని, కానీ రూపాయి పేదలకు ఇవ్వలేదన్నారు.

సెస్‌ దోపిడీపై తీర్మానాన్ని బలపరిచిన ఎంపీ రంజిత్‌ రెడ్డి..
ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు చెప్పిన గణాంకాలన్నీ అక్షర సత్యాలని, రాష్ట్రాలకు కేంద్రం ఏ విషయంలోనూ సహకరించడం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. సెస్‌లను కేవలం సెంట్రల్‌ పూల్‌కు వసూలు చేసుకోకుండా డివిజబుల్‌ పూల్‌లో వసూలు చేసి రాష్ట్రాలకు ఆదాయం ఇవ్వాలని హరీశ్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నట్లు రంజిత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement