Friday, May 3, 2024

IPL2022: బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌, రాజ‌స్థాన్ 169.. 14 ఓవ‌ర్ల‌లో బెంగళూరు 5 వికెట్ల‌కు 109

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్తాన్-బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. వికెట్లు పెద్దగా కోల్పోనప్పటికీ ఆటలో దూకుడు తగ్గడంతో రాజస్తాన్ స్కోర్ మంద‌గించింది. చివరిదాకా క్రీజులో ఉన్న ఓపెనర్ బట్లర్ చివరలో మెరుపులు మెరిపించాడు. బట్లర్‌కు తోడు హెట్‌మెయర్ కూడా చివరలో మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కాగా, సెకండ్ ఇన్సింగ్స్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు ఆ మాత్రం స్కోరు చేజ్ చేయ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతోంది. 14 ఓవ‌ర్ల‌కు కీల‌క‌మైన 5 వికెట్లు పోగొట్టుకుని 109 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ప్ర‌స్తుతానికి క్రీజులో దినేష్ కార్తీక్‌, ష‌హ‌బాద్ అహ్మ‌ద్ ఉన్నారు.

ఇక ..రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో జోస్ బట్లర్ 47 బంతుల్లో 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హెట్‌మెయర్ 31 బంతుల్లో 2 సిక్స్‌లు 4 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్‌లతో 37 పరుగులు చేశారు. మరో ఓపెనర్ జైస్వాల్ (4), కెప్టెన్ సంజు శాంసన్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బెంగళూరు బౌలర్లలో విల్లీ, హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. కాగా, ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్ జట్టు 211, 193.. ఇలా భారీ స్కోర్లే నమోదు చేసింది. తాజా మ్యాచ్‌లో మాత్రం ఆ దూకుడు తగ్గింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై నెగ్గిన రాజస్తాన్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించి రెండు విజయాలు నమోదు చేసింది. ఇక బెంగళూరు జట్టు ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. తాజా మ్యాచ్‌తో రాజస్తాన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తుందా.. లేక రాజస్తాన్ దూకుడుకు బెంగళూరు బ్రేక్ వేస్తుందా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement