Sunday, May 5, 2024

ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక చేయూతనివ్వండి.. రెండురోజల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయనకు వైసీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, వంగా గీత‌, గొడ్డేటి మాధ‌వి, డాక్టర్ సత్యవతి, అయోధ్య‌రామిరెడ్డి, గురుమూర్తి, గోరంట్ల మాధ‌వ్‌, తలారి రంగ‌య్య‌, రెడ్డ‌ప్ప‌, కోట‌గిరి శ్రీ‌ధ‌ర్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ తదితరులు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 4.45 గంటలకు వైఎస్ జ‌గ‌న్‌ ప్రధానితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వివిధ అంశాలపై ఆయన ప్రధానితో చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధానికి నివేదించారు.

ప్రధానికి సీఎం నివేదించిన అంశాలు..

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని జగన్ కోరారు. 2019 ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించిందని, ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో నిర్మాణ పనుల కోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని చెప్పారు. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్‌వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను ³రిగణలోకి తీసుకోవాలని, నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని ముఖ్యమంత్రి అడిగారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపు కోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఏపీకి అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్‌ అందిస్తుంటే కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోందని, మిగిలిన 0.56 కోట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చు చేస్తూ రేషన్‌ ఇస్తోందని ప్రధానికి వివరించారు. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61శాతం రూరల్, 41శాతం అర్బన్‌ ప్రజలకు మాత్రమే రేషన్‌ను ఇస్తున్నారని, దీన్ని వెంటనే సరిదిద్దాలని అభ్యర్థించారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ గడువు ముగిసినందున తాజా క్లియరెన్స్‌కు పౌర విమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్‌ ఇప్పటికీ తన నివేదిక ఇవ్వలేదని, రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నడుం బిగించిందని వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేంద్రం తోడ్పాటునందించాలని కోరారు. అలాగే ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రాంతాలను కేటాయించాలని, 16 చోట్ల బీచ్‌శాండ్‌ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని ప్రధానమంత్రికి నివేదించారు. అటమిక్‌ ఎనర్జీ విభాగం ఇప్పటికే 2 ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించిందని, న 14 ప్రాంతాలకు సంబంధించి కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వాలని జగన్ పేర్కొన్నారు.

- Advertisement -

మహమ్మారులు సోకినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత కీలకమో ఇటీవల కోవిడ్‌ పరిస్థితుల్లో వెల్లడైంది. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను గణనీయంగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. కొత్తగా మరో కేంద్రం అనుమతులు జారీ చేసిన మూడింటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులివ్వాలని జగన్ వినతి చేశారు. రెవిన్యూ గ్యాప్‌ను భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉండడం వల్ల ఆర్థికంగా ఏపీకి నష్టం వాటిల్లిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నాటికి పెండింగ్‌ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సిన బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిందని, ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీ చేయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్‌కురాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్‌ నగరంను కోల్పోవడంద్వారా ఆ నగరం నుంచి అందే 38 శాతం రెవిన్యూను కోల్పోయామని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత వచ్చిన కోవిడ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీయడంతో దాదాపు రూ. 33,478 కోట్ల మేర ఆదాయం రాకుండా పోయిందని వాపోయారు. కోవిడ్‌ నివారణ, చికిత్సలకోసం మరో రూ.7,130 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని, 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గడం మరొక ప్రతికూల పరిణామమని ప్రధానికి వివరించారు. గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా రాష్ట్ర రుణ పరిమితుల్లో కోత విధిస్తామనడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని చెప్పారు. విధించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకురాలేదని, ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా ప్రధానిని కోరారు.

తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజించిన నాటినుంచీ జూన్‌ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్‌ పంపిణీకి సంబంధించి మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా అభ్యర్థించారు. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరమని ప్రధానికి తెలిపారు. నరేంద్రమోదీతో భేటీ అనంతరం జగన్మోహన్‌రెడ్డి రాత్రి 7 గంటల సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ప్రధానితో చర్చించిన ఆర్థిక అంశాలను ఆమెకు వివరించారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు విడుదల చేసి చేయూతనందించవలసినదిగా కోరారు. అనంతరం 8.15 గంటలకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ఆమోదం సహా నీటి పారుదల ప్రాజెక్టుల అంశాల గురించి చర్చించారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ డిజైన్లకు గత వారమే జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. డిజైన్లకు ఆమోదం అంశంపైనే ప్రధానంగా చర్చ నడిచింది. గత ప్రభుత్వ హయాంలో కాఫర్ డ్యామ్, మెయిన్ డ్యామ్ (రాక్ ఫిల్ డ్యామ్) వద్ద పడ్డ గుంతలు పూడ్చే డిజైన్లపై పలు అంశాలను సీఎం షెకావత్‌కు వివరించారు. నిర్మాణ సమయంలో డీ-వాటరింగ్ లేదా హైడ్రోలిక్ ఫిల్లింగ్ విధానంలో చేయాలా అన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. రాక్ ఫిల్ డ్యామ్ గుంతలు పూడ్చే డిజైన్లకు ఆమోదం తెలిపారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కూడా ఆమోదముద్ర వేశారు. జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ డిజైన్ల ఆమోదం అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ గత నెల రోజులుగా సమీక్షలు జరువుతున్నారు. అనంతరం రాత్రి 9.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement