Monday, May 6, 2024

Breaking : ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని – హిజాబ్ పై కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

ఒక్కొక్క‌రు ఒక్కోర‌క‌మైన దుస్తులు ధ‌రిస్తార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆయ‌న స్పందించారు. హైద‌రాబాద్ లో క‌ల‌హాలు సృష్టించే ప్ర‌యత్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇలాంటి ధోర‌ణి ఉంటే పెట్టుబ‌డుల‌కు ఎవ‌రొస్తార‌ని ప్ర‌శ్నించారు.
దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన హిజాబ్ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించ‌డం హాట్ టాపిక్ గా మారింది. మన దేశానికి ఐటీ క్యాపిటల్ గా బెంగళూరు ఉందని, ఆ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఈ రెండు నగరాల్లో విదేశాలకు చెందిన ఎందరో పని చేస్తుంటారని అన్నారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెడుతున్నారని… ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం అభ్యంతరమని ప్రశ్నించారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని అడిగారు. మత కలహాలు పెట్టడానికే హిజాబ్ పంచాయతీ పెట్టారని విమర్శించారు. హిజాబ్ లాంటి సమస్యలు, మత కలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి వివాదాల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. యూపీఏను ఓడించి ఎన్డీయేను గెలిపించినందుకు దేశ పరిస్థితి ఇలా తయారయిందని చెప్పారు. బీజేపీ సంకుచిత వ్యవహారాలు చేస్తోందని అన్నారు. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు. పెడధోరణి దేశానికి మంచిది కాదని, దీనిపై దేశ, రాష్ట్ర యువత ఆలోచించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement