Sunday, May 19, 2024

PM MODI: ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలి.. మోడీ

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ… ‘గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నాం’ అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

”వైకాపా ప్రభుత్వం అవినీతిని జెట్‌ స్పీడ్‌తో పరిగెత్తించింది. అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారు. రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. వైకాపా సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు నెలవు. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించింది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్‌తో అభివృద్ధి చెందాలి. కానీ, కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధోగతి పాలు చేసింది. ఈడీ.. ఈడీ.. అంటూ ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్‌ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతోంది. ఆ పార్టీ నేతల డబ్బును మెషీన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి”

మూడు రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు..

- Advertisement -

”మూడు రాజధానులు చేస్తామన్నారు.. చేయలేదు కానీ, మూడు రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు. ఏపీలో మద్యం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా.. గద్దె నెక్కిన తర్వాత మద్యం సిండికేట్‌గా తయారైంది. వైకాపా ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప.. రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైకాపా ఖాళీ చేసింది. పోలవరం కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చింది. కానీ, ఆ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలనుకుంది. కానీ, కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేక పోయింది. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక చరిత్ర ఉన్న భూమి. రాముడి చరిత్రను సినిమాల ద్వారా ఎన్టీఆర్‌ ఇంటింటికీ తీసుకెళ్లారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను కాంగ్రెస్‌ బహిష్కరించింది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక నేతను కాంగ్రెస్‌ బహిష్కరించింది. దిల్లీ- ముంబయి కారిడార్‌ మాదిరి విశాఖ-చెన్నై కారిడార్‌ నిర్మాణం చేపడతాం. చెన్నై-కోల్‌కతా హైవే, రాజమహేంద్రవరం విమానాశ్రయం ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మారుస్తాయి. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్‌ విశ్వాసం ఉన్నాయి. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయండి ” అని మోదీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement