జమ్మూ కాశ్మీర్ షోపియాన్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్లోని జెన్పోరా పరిధిలోని చెర్మార్గ్ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు చుట్టుముట్టినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తమకు అందిందని భద్రతా బలగాలు మీడియాకు తెలిపాయి. సైన్యం, CRPF యొక్క సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అనుమానాస్పద స్థావరం వైపు టీమ్ వెళ్లగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతీకారంగా భద్రతా బలగాలు, ఆర్మీ బృందాలు కూడా కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతానికి ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్నది తెలియరాలేదు. ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత, భద్రతా దళాలు , స్థానిక పోలీసులు దానిపై దర్యాప్తు చేయనున్నారు. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. ఇప్పుడు, ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదుల ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనడానికి , శోధన కార్యకలాపాలను నిర్వహించడానికి భద్రతా దళాలు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..