Sunday, May 5, 2024

బీజేపీ నేతలకు శాపం ఉన్నట్టున్నది.. నిజాలు మాట్లాడాలంటే వారికి భ‌యం: హరీశ్‌రావు

బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం జ‌రిగిన ప‌ట్ట‌ణ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మంత్రి మాట్లాడారు. పాలమూరు మీటింగ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం చదివి వెళ్లారని, బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందన్నారు. కేంద్ర బీజేపీలో ఆధిపత్య పోరు కనిపిస్తుందని, గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెబితే.. నాయకులు మరోమాట చెబుతున్నారన్నారు. బీజేపీ పార్లమెంట్‌లో ఓ మాట.. పాలమూరులో ఇంకోపాట పాడిందని ఆరోపించారు. నిన్నటి సభలో నడ్డా ప్రస్తావించిన ఐదు విషయాలపై మంత్రి స్పందించారు.

‘కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం’ అన్నారు.. అయితే ఇవన్నీ అబద్ధాలేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

అబద్ధం నెంబర్‌ 01..
కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదు. ‘నేను నడ్డా గారిని కోరుతున్న. మేమే ఖర్చులు భరిస్తాం. రాష్ట్రమంతా తిప్పుతాం. మీరే నేరుగా రైతులతో మాట్లాడండి. తెలంగాణలో 33 జిల్లాలుంటే దాదాపు 20 జిల్లాల ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చుతుంది. క్షేత్ర పర్యటన చేసి నిజా నిజాలు తేల్చడానికి మేము సిద్ధం. రావడానికి మీరు సిద్ధమా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

‘నడ్డా వస్తారో.. ఎవరు వస్తారో రండి.. మా సిద్ధిపేట. నేను చెప్ప మా రైతులు చెబుతరు. ఎక్కడో ఎందుకు సిద్ధిపేటకు వచ్చి చూడు.. 50 గ్రామాల్లో కాళేశ్వరం నీళ్లు చూపిస్తాం. పంట పొలాల్లో.. కాలువల్లో గళగళ పారుతున్న గోదావరి జలాల గురించి నేను కాదు మా రైతులు చెబుతరు’ అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అవగాహన లేకుండా, అక్కసుతో రాసిచ్చిన స్క్రిప్టును చదివి అభాసు పాలు కావడం కన్నా గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకుని మాట్లాడితే.. ఢిల్లీ నాయకులకు గౌరవంగా ఉంటుందని హ‌రీశ్‌ అన్నారు.

‘నడ్డా అబద్ధాలు, అంతకు రెండు రోజుల ముందే కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంసలు చూస్తుంటే, కేంద్ర మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయం లోపం, సమాచార లోపం చాలా స్పష్టంగా కనిపిస్తున్నద‌ని ఎద్దేవా చేశారు. ఇద్దరూ వేర్వేరుగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని, తెలంగాణ దేశానికే గ్రోత్ ఇంజిన్ అని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంసిస్తే, నడ్డా అడ్డదిడ్డం మాట్లాడారు. గడ్కరీ కేంద్ర మంత్రి మాత్రమే కాదు, బీజేపీకి చాలా కాలం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరి నడ్డా గారు గడ్కరీ మాటలను ఖండించినట్లా?’ అని హ‌రీశ్‌రావు ప్రశ్నించారు.

- Advertisement -

అబద్ధం నంబర్-2..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంలా మారింది అని నోటికొచ్చినట్లు మాట్లాడారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘దీనికి అసలు మేం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సాక్షాత్తూ కేంద్ర జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు నిండు పార్లమెంటులోనే చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదు. అన్నీ పారదర్శకంగా జరిగాయి అని కేంద్ర మంత్రి చెప్పారు. మరి కేంద్ర మంత్రి అవినీతి లేదు అంటే.. బీజేపీ నాయకులు మాత్రం అవినీతి అంటున్నారు. మంత్రిదో మాట, బీజేపీ అధ్యక్షుడిదో మాట. పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఓ పాట’ అంటూ విమర్శించారు.

అబద్ధం నంబర్..3
కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నామని బీజేపీ అధ్యక్షుడు న‌డ్డా అన్నారని, ఇంతకంటే అధ్వాన‌మైన ఆత్మవంచన మరోటి లేదని హరీశ్‌రావు అన్నారు. ‘ఆత్మవంచన చేసుకోవడంలో బీజేపీ నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దాదాపు 600 కార్యక్రమాలు అమలు చేస్తున్నది. మీ కేంద్ర ప్రభుత్వం కనీసం 60 కార్యక్రమాలైనా అమలు చేస్తున్నదా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాటిలో సగమైనా అమలవుతున్నాయా? ఏ రాష్ట్రానికైనా పోయి క్షేత్ర పర్యటన చేద్దాం.

కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని చెబుతున్నారు కదా? చెప్పండి మా పథకాల్లో మీ వాటా ఎంతో చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? పాలమూరు ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఇచ్చారు? మిషన్ భగీరథలో మీ సాయం ఎంత? రైతుబంధులో మీ వాటా ఎంత? రైతు బీమా కోసం మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు? వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మీరు పెట్టిన ఖర్చు ఎంత? ఆడపిల్ల పెండ్లిళ్లకు ఇచ్చే రూ.లక్ష కల్యాణలక్ష్మి పథకానికి మీరు ఏమైనా ఇచ్చారా? రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇస్తున్నాం.. కేసీఆర్ కిట్స్‌లో మీరు ఏమైనా ఇచ్చారా? దళిత బంధు పథకంలో మీరు భాగస్వామ్యం తీసుకున్నారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

‘పొద్దున లేస్తే మత ఘర్షణలు పెడతారు కదా? దేవుడిపై మీకే భక్తి ఉన్నట్లు చెబుతారు కదా? యాదాద్రి అభివృద్ధికి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు ? అసలు తెలంగాణలో ఏ గుడికైనా ఒక్క రూపాయి ఇచ్చారా? వీటికి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కేంద్రం నుంచి వచ్చే సాయం సున్నా అనీ.. అయినా సరే గప్పాలు కొట్టడం తగదు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఎలాంటి సాయం చేయకపోగా, మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన, రాజ్యాంగపరమైన నిధులు కూడా కేటాయించడం లేదని ధ్వజమెత్తారు.

గతంలోనే అనేకసార్లు చెప్పామని, తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నది ఎంత? మనకు తిరిగి వస్తున్నది ఎంత? దీనికి సమాధానం లేదని, రాష్ట్రం కేంద్రానికి ఇస్తున్నదా? కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నదా? లెక్కలు కావాలంటే మీకు పంపుతామని, మీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను అడిగినా చెబుతారన్నారు. నిధులు ఇవ్వకపోగా, తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా, న్యాయంగా రావాల్సిన అప్పులను కూడా ఆపుతూ, ఆర్‌బీఐని ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రగతిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని హ‌రీశ్‌రావు విమర్శించారు.

అబద్ధం నంబర్ 4..
బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని నడ్డా అన్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇదే పాలమూరులో 2014 ఎన్నికల సభలో నరేంద్ర మోదీ మాట్లాడారనీ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టకుండా సోనియా-రాహుల్ (తల్లీ కొడుకులు) పదేళ్లు నిద్రపోయారు.. మేము అధికారంలోకి వస్తే పాలమూరు పూర్తి చేస్తాం అని నరేంద్ర మోదీ చెప్పినట్లు గుర్తు చేశారు. ‘బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం రాశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ, పాలమూరు ప్రాజెక్టులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అదే పాలమూరుకు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చారు. పక్కనే ఉన్న కర్నాటకలో అప్పర్ భద్ర జాతీయ ప్రాజెక్టు చేపట్టి నిధులు ఇచ్చారు.

ఆ పక్కనే ఉన్న బుందేల్‌ఖండ్‌, కెన్ బెత్వా ప్రాజెక్టు నిధులు ఇచ్చారు. తెలంగాణలో మీరు హామీ ఇచ్చిన ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు. అధికారంలోకి వస్తే అంటున్నారు. నడ్డా గారు, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే. మీరు అధికార పార్టీలోనే ఉన్నారు. మీకు మంత్రివర్గంలో చోటు లేనంత మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నట్లు భావించొద్దు. పాలమూరుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు ప్రాజెక్టులకు ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పాలి. మాటలు కోటలు దాటినా, చేతలు కడప దాటవనే సామెత బీజేపీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది’ అని మంత్రి హ‌రీశ్‌రావు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

రాహుల్ గాంధీపై మండిపడ్డ మంత్రి హరీశ్‌
కాంగ్రెస్ ముఖ్య నేత‌ రాహుల్ ఏ హోదాలో డిక్లరేషన్ ఇస్తారో అర్థం కావడం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారు చెప్పిన ప‌థ‌కాల‌న్నీ రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లో అమలు అవుతున్నాయా ? అని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాలను నిలబెట్టుకోలేని అసమర్థుడు రాహుల్ గాంధీ అని, తెలంగాణ ద్రోహి.. చంద్రబాబు చెప్పులు మోసిన వారు మీ పార్టీలో ఉన్నారని, కేంద్రంలోని బీజేపీపై పోరాడలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement