హైదరాబాద్, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల కేసు విచారణ వివరాలను ఈడీకీ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేమిటని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారంనాడు ఈడీ జాయింట్ డైరెక్టర్ను కలిసి హైకోర్టు తీర్పు కాపీ, వినతిపత్రం అందజేశారు. డ్రగ్స్ కేసు విచారణను ఈడీకి ఇవ్వాలని గతంలో రేవంత్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవరిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ”రాష్ట్రంలో గుట్కా లేదు, మట్కా లేదు.. గుడుంబా లేదు. పేకాట లేదని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. 2017 నుంచి విచారణ అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నా. డ్రగ్స్ మహమ్మారి విద్యా సంస్థల్లోకి చేరింది. డ్రగ్స్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లాంటి పెద్దలు ప్రగల్భాలు పలికారు. సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా..? దూల్పేట గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు కానీ, వారికి ప్రత్యామ్నాయం కల్పించలేదు. అందుకే వాళ్లు గంజాయి అమ్ముతున్నారు, వాడుతున్నారు. స్కూల్ నుంచి కాలేజీల వరకు విచ్చలవిడిగా డ్రగ్స్ లభిస్తోంది.
జూబ్లిహిల్స్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో 4 పబ్లు ఉంటే ఇవాళ 90పబ్లు ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లిdహిల్స్లో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. 2017లో డ్రగ్స్ విచారణ ఏమైయింది.. ఎందుకు అటకెక్కింది..? అకున్ సబర్వాల్ను అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేశారు..? అప్పుడు నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లో ఏమైనాయి..?. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశా.. అయినా ముందుకు రాలేదు. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లా.. తెలంగాణ యువత, ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలి. నైజీరియా నుంచి వచ్చిన వాళ్లు రాజ్యమేలుతున్నారు” అని రేవంత్రెడ్డి విమర్శించారు.
ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు..
డ్రగ్స్ కేసును ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి విచారణను వ్యతిరేకిస్తోందని, ప్రభుత్వం సహకరించడం లేదని ఈడీ స్పష్టంగా చెబుతోందని పీసీసీ రేవంత్రెడ్డి ఆరోపించారు. ”డ్రగ్స్ కేసులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ దగ్గర అన్ని ఆధారాలున్నాయి. కానీ, ఈడీకి ఇవ్వడంలేదు. డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లు, వాడిన వాళ్లు, అమ్మే వాళ్లు.. ఇలా 3 రకాల నేరస్థులు ఉన్నారు. గుజరాత్, ముంబై పోర్టుల్లో 100 క్వింటాళ్ల డ్రగ్స్ పట్టుపడింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేయాలని కోరుతున్నా. మీరు సేకరించిన ఆధారాలు, సాక్షాలు వెంటనే ఈడీకి అందజేసి కోర్టు ఆదేశాలు పాటించాలి. డ్రగ్స్ వాడే వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే చర్యలు తీసుకోండి. సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. డ్రగ్స్ వాడకుండా చూడండి. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రాసిపెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తాం” అని రేవంత్రెడ్డి హెచ్చరించారు.