Sunday, May 12, 2024

నేవీలో 20శాతం మహిళా ‘అగ్నివీర్స్’​.. ఈ ఏడాది 3వేల మందిని రిక్రూట్​ చేసుకునే చాన్స్​!

భారత నావికాదళంలోకి ‘అగ్నివీర్స్’లో దాదాపు 20 శాతం మంది మహిళలను తీసుకోనున్నారు. ‘అగ్నిపథ్​’ రిక్రూట్‌మెంట్ పథకం కింద ఈ ఏడాది సుమారు 3,000 మంది సిబ్బందిని నియమించాలని నేవీ యోచిస్తోంది. జులై 1 నుంచి ఔత్సాహికుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కొత్త పథకం ద్వారా నేవీ మొదటిసారిగా మహిళలను, నావికులను రిక్రూట్ చేయనుంది. నావికాదళ అగ్నివీర్లలో 20శాతం మంది మహిళలు తమ అవసరాలకు అనుగుణంగా చేర్చుకోనుంది.. అని నేవీ సీనియర్ అధికారి తెలిపారు.

జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ పథకం 17న్నర సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను కేవలం 4 సంవత్సరాలకు మాత్రమే రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు కొనసాగించాలనే కండిషన్​ ఉంది. 2022 కోసం గరిష్ట వయోపరిమితి 23సంవత్సరాలకు పొడిగించారు. ఈ పథకం కింద త్రివిధ దళాలు ఈ సంవత్సరం 46వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నాయి. రాబోయే సంవత్సరాల్లో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక.. జూలై 15 నుండి 30వ తేదీ వరకు దరఖాస్తు విండో ఓపెన్​లో ఉంటుందని, అక్టోబర్ మధ్యలో పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ వంటి ఎగ్జామ్స్​ జరుగుతాయని నేవీ ఇప్పటికే ప్రకటించింది. నవంబరు 21 నాటికి ఒడిశాలోని INS చిల్కాలో శిక్షణా కార్యక్రమంలో మొదటి బ్యాచ్ రిక్రూట్‌లు చేరతారని పేర్కొంది. అయితే.. ఈ కొత్త సైనిక నియామక పథకాన్ని ప్రకటించిన తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ‘అగ్నిపథ్’ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే వారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement