Monday, May 6, 2024

TS: గ్రామ కంఠం భూములపై సమగ్ర అధ్యయనం.. పల్లె ప్రగతితో ఎంతో అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోని గ్రామ కంఠం భూములపై సమగ్ర అధ్యయనం చేయనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రామ కంఠంలోని భూ యాజమానుల భూములను గుర్తించి, వాటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని టిఎస్‌ ఐఆర్‌డిలో అందుబాటులో ఉన్న డీపీఓలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, గ్రామ సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయని, ధరణి వంటి అధునాతన సాంకేతికతతో భూ సమస్యలకు పరిష్కారం చూపెట్టామన్నారు.

అదే తరహాలో గ్రామ కంఠం భూముల సమస్యను పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామ కంఠంలోని భూములను స్థిరీకరించి, వాటి క్రయవిక్రయాలకు వీలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మెదక్‌ జిల్లాలోని కొత్తపల్లి, మల్లంపేట, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అన్నారెడ్డిఫల్లి, నంచెర్ల గ్రామ పంచాయతీల్లో పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టామన్నారు. అలాగే స్వామిత్వ పథకం కింద రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతి గూడ, మేడ్చెల్‌ జిల్లా కీసర మండలం గోధుమ కుంట, జనగామా జిల్లా స్టేషన్‌ ఘనాపూర్‌ మండలం ఘనాపూర్‌ స్టేషన్‌ గ్రామం, ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం అర్లి గ్రామం, కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం దోమకొండ గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద డ్రోన్‌ల ద్వారా సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో గ్రామ కంఠాలకు సంబంధించి కొత్తమ్యాప్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ రెండు సర్వేల ద్వారా కొత్తగా వస్తున్న సమస్యలే ఏమిటి? గ్రామ కంఠం భూములకు శాశ్వత పరిష్కారం చూపాలంటే ఇంకేమి చేయాలనే అనే అంశాలను పరిశీలిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో రికార్డులు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. అలాగే, రివిజన్‌ రిజిస్టర్‌ రికార్డులను అప్‌ డేట్‌ చేయాలని చెప్పారు. త్వరలోనే పంచాయతీ కార్యదర్శలతో మరో సమీక్ష నిర్వహిస్తామని, ఈలోగా గ్రామస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల క్షుణ్ణంగా అధ్యనం చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement