Tuesday, May 7, 2024

ముంబైలో 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. ఆలియాకి ఉత్త‌మ‌న‌టి అవార్డ్

ముంబైలో 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023వేడుక ఘ‌నంగా జ‌రిగింది. జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ తారలు ఆలియా భట్‌, జాన్వీ కపూర్, భూమి పడ్నేకర్, పూజా హెగ్డే, ఫాతిమా సనా ఖాన్, దియా మీర్జా, నర్గీస్ ఫక్రీ, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోని, రేఖ, కాజోల్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తారలు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు. ఈ ఏడాది గంగూబాయి కఠియావాడి , బాదాయ్ దో చిత్రాలకు అవార్డులు వరించాయి. ఈ ఏడాది ఈ రెండు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వరించాయి. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా ఏకంగా 9 విభాగాల్లో ‘గంగూబాయి కఠియావాడి’ చిత్రం అవార్డులను సొంతం చేసుకోగా.. ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో ‘బాదాయ్ దో’ సినిమా అవార్డులు గెలుచుకుంది.

ఉత్తమ చిత్రంగా ‘గంగూబాయి కఠియావాడి’ ఎంపిక కాగా, అదే సినిమాకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా, కథానాయికగా చేసిన అలియా భట్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ‘బదాయ్ దో’ సినిమాకు గాను రాజ్‌కుమార్ రావ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అదే సినిమాలో నటించిన షీబీ చద్దా ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది. అదేవిధంగా.. ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) సంజయ్ మిశ్రా (వధ్), ఉత్తమ నటి (క్రిటిక్స్) టబు (భూల్ భులయా 2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో), ఉత్తమ సహాయ నటుడిగా జగ్‌జగ్ జీయో సినిమాకు గాను అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా యువతను విశేషంగా అలరించిన ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1’లోని ‘కేసరియా’ పాటకు ఉత్తమ సాహిత్య, గాయకుడి అవార్డులు వరించాయి. అయితే, అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement