Saturday, April 27, 2024

సాగర్ బరి నుంచి వారు ఔట్!

తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఉప ఎన్నికల బరిలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు.. కొందరు రెబెల్స్ తో పాటు.. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 77 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. తాజాగా స్క్రూట్నీ పూర్తి చేశారు. 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. వీరిలో బీజేపీ రెబల్ అభ్యర్థి నివేదిత రెడ్డితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నామినేషన్లను తిర్కరించారు. వీరిద్దరితో పాటు మరో 15 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బరిలో 60 మంది అభ్యర్థులు నిలిచారు.

ఇక, ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. ఫలితాలు మే 2న వెలువడనుంది. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్.. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి.. బీజేపీ నుంచి రవినాయక్ లు నామినేషన్లు దాఖలు చేయటంతో పాటు.. ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణపై ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 346 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు ఆర్వో రోహిత్ సింగ్ చెప్పారు. గతానికి భిన్నంగా ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 53 పోలింగ్ కేంద్రాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  ఇక.. పోలింగ్ వేళలు సైతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. ఏడు గంటల సమయానికి క్యూలైన్లో ఉన్న వారందరికి ఓట్లు వేసే వీలు కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement