Thursday, May 2, 2024

రేపే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ-20.. నాగ్‌ పూర్‌ విసీఏ స్టేడియం వేదికగా మ్యాచ్‌

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 సెప్టెంబర్‌ 23న నాగ్‌పూర్‌లో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలిమ్యాచ్‌ నెగ్గిన ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపొంది సిరీస్‌ సొంతం చేసుకోవాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు తొలిమ్యాచ్‌లో బ్యాటర్లు సత్తా చాటినా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం, పేలవ ఫీల్డింగ్‌ కారణంగా ఓటమి చవి చూసిన టీమ్‌ ఇండియా ఈ మ్యాచ్‌ గాడిలో పడాలని కోరుకుంటోంది.

నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌ ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 జరగనుంది. ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరకుండానే ఇంటిముఖం
పట్టిన టీమ్‌ ఇండియా, ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ 20లో కూడా పరాజయం చవిచూసింది. వచ్చే నెలలో టీ 20 ప్రపంచకప్‌ జరగనున్న వేళ భారత్‌ జట్టును ఇంకా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా పేస్‌ బౌలర్లు చివరి ఓవర్లలో భారీగా పరుగులిస్తుండటం టీమ్‌ ఇండియాను కలవరపెడుతోంది. వెన్ను నొప్పి కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్‌ బుమ్రా ఆసిస్‌ సిరీస్‌కు ఎంపికైనా తొలిమ్యాచ్‌లో అతన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆడించలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా లేడా అనేది సందేహంగా మారింది.

బుమ్రా ఫిట్‌నెస్‌ కీలకం

టీ 20 ప్రపంచకప్‌ కంటే ముందు టీమ్‌ ఇండియా ఇంకా 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్న నేపథ్యంలో బుమ్రా రాక కీలకంగా మారింది. మొహాలీ టి 20లో భారత పేసర్లు 14 ఓవర్లలో ఏకంగా 150 పరుగులు సమర్పించుకున్నారు. పాకిస్తాన్‌ , శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ వేసిన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. అటు స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. చాహల్‌ స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. మరో వైపు రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ మొహాలీ టీ 20లో 3 వికెట్లతో సత్తా చాటాడు.

- Advertisement -

ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్‌ ఫీల్డింగ్‌ పేలవంగా ఉంది. మూడు క్యాచ్‌లను భారత ఫీలర్లు వదిలేశారు.
భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్యాటింగ్‌లో మాత్రం టీమ్‌ ఇండియా పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తక్కువ పరుగులకే వెనుదిరిగినా కె ఎల్‌ రాహుల్‌ , హార్థిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగి ఆడాడు. భారత స్కోరును 200 పరుగులు దాటించారు. దినేష్‌ కార్తిక్‌ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కార్తీక్‌కు మరో అవకాశం ఇస్తారా లేదా రిషబ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు కల్పిస్తారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు డేవిడ్‌ వార్నర్‌ , మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ మార్ష్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా తొలి టీ 20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్‌ రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ అర్థ శతకంతో సత్తా చాటాడు. స్టీవెన్‌ స్మిత్‌, టిమ్‌ డేవిడ్‌ కూడా రాణించారు. 21 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఫినిషర్‌ పాత్రలో మాథ్యూ వేడ్‌ సత్తా చాటాడు. ఐతే రెండో టీ 20లో బౌలర్లు మెరుగ్గా రాణించాలని.. ముఖ్యంగా పేసర్లు పాట్‌ కమ్మిన్స్‌ , హేజిల్‌వుడ్‌, గ్రీన్‌ భారత బ్యాటర్లను కట్టడి చేయాలని ఆస్ట్రేలియా కోరుకుంటోంది. అయితే నాగ్‌పూర్‌లో వీసీఏ స్టేడియం మొహాలీ పిచ్‌ మాదిరిగా ఉండదని ఇక్కడ వికెట్‌ స్లోగా ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు బౌలర్లకు పిచ్‌ అనుకూలించే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌ శుక్రవారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుండగా.. టాస్‌ గెలిచే జట్టు తొలుత ఫీల్డింగ్‌ చేసేందుకు మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement