Saturday, May 4, 2024

ఎయిర్‌ పిస్టల్‌ నేషనల్‌ ట్రయల్స్‌లో శివ నర్వాల్‌, నేహా విజయం

గ్రూప్‌ ఎ రైఫిల్‌/ పిస్టల్‌ షూటర్ల జాతీయ ఎంపిక ట్రయల్స్‌ చివరి రోజున, హర్యానా యువకుడు శివ నర్వాల్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టి-3 ట్రయల్‌ విజేతగా నిలిచాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేహా మహిళల ఈవెంట్‌ను గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌ రాజధాని నగరం భోపాల్‌లోని స్టేట్‌ షూటింగ్‌ అకాడమీ రేంజ్‌లో ఈ పోటీలు జరిగాయి. స్వర్ణ పతక పోరులో శివ 17-7తో పంజాబ్‌కు చెందిన అర్జున్‌ సింగ్‌ చీమాను ఓడించగా, మహిళల టైటిల్‌ మ్యాచ్‌లో నేహా 17-9తో రిథమ్‌ సాంగ్వాన్‌ను ఓడించింది.

క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో కూడా శివ 582 స్కోరుతో గెలిచాడు. ర్యాంకింగ్‌ రౌండ్‌లో 25 షాట్‌ల తర్వాత 252.9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. అర్జున్‌ 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. విజయానికి నేహా శ్రమించాల్సి వచ్చింది. ఆమె 573 స్కోర్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. హర్యానాకు చెందిన రిథమ్‌ షూటింగ్‌ 573తో ఏడవ స్థానంలోను, యశస్విని దేస్వాల్‌ షూటింగ్‌ 574తో ఆరో స్థానంలో నిలిచారు. 248.3తో రెండవ స్థానంలో ఉన్న నేహా, 246.9తో మూడవ స్థానంలో నిలిచిన యశస్విని కంటే చాలా ముందుంది. అయితే ఫైనల్‌లో నేహా రిథమ్‌ను తిప్పికొట్టి విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement