ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్లో బలమైన జట్లతో ఆడటం ద్వారా తమ సామర్థ్యానికి మెరుగులు దిద్దుకునే అవకాశం లభిస్తుందని భారత పురుషుల హాకీ ఫార్వర్డ్ మన్దీప్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది ఒడిశాలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి ముందు దీనిని మంచి సన్నాహక ప్రక్రియగా పేర్కొన్నాడు. 2023 జనవరి 13 నుంచి 29 వరకు ప్రపంచకప్ జరుగుతుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ప్రపంచకప్కు ముందు ప్రోలీగ్ మొదటి దశలో న్యూజిలాండ్, స్పెయిన్లతో భారత జట్టు ఆడుతుంది.
ప్రధాన టోర్నీకి ముందు బలమైన జట్లతో తలపడటం ఎప్పుడూ మంచిదే. మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశాన్ని ఇస్తుంది అని నొక్కిచెప్పాడు. స్వదేశీ అభిమానుల ప్రోత్సాహం నడుమ మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్నట్లు చెప్పాడు. భారత పురుషుల జట్టు ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్తోపాటు పూల్ డిలో ఉంది. కఠినమైన గ్రూప్లో ఉన్నప్పటికీ, తన జట్టు అత్యుత్తమ సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని మన్దీప్ ధీమా వ్యక్తంచేశాడు. మేము మా బేసిక్స్కు కట్టుబడి ఉండి, శిక్షణలో మెరుగు పరుచుకోవాల్సిన అంశాలపై దృష్టిసారిస్తే ప్రపంచకప్లో బాగా రాణించగలమనే నమ్మకం ఉందని చెప్పాడు.