విండీస్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ బౌలర్ షాహిన్ అఫ్రీది విజృంభించడంతో విండీస్ ను చిత్తు చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఆతిథ్య వెస్టిండీస్పై 109 పరుగులతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఐదో రోజులో భాగంగా 49/1 క్రితం రోజు స్కోరుతో బరిలోకి దిగిన విండీస్ పాక్ బౌలర్ల దాటికి 219 పరుగులకు ఆలౌట్ అయింది. జాసన్ హోల్డర్ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కైల్ మేయర్స్ 32, కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ 39 పరుగులు చేశారు. షాహిన్ అఫ్రిది 4, హసన్ అలీ 2, నుమాన్ అలీ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు మొత్తం 10 వికెట్లతో ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది దమ్మురేపాడు.
ఇక పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్కు 152 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ను పాక్ 176 పరుగుల వద్ద డిక్లేర్ చేసి విండీస్ ముందు 329 పరుగుల భారీ టార్గెట్ను ఉంచింది. ఇక తాజా విజయంతో రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది.
ఇది కూడా చదవండి: Face Book: ఫేస్బుక్ నుంచి కొత్త ఫీచర్