Sunday, May 19, 2024

Delhi | ‘మై టీడీపీ’ యాప్‌లతో మాల్‌ ప్రాక్టీస్‌.. సీఈసీకి వైసీపీ ఎంపీల ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ “మై పార్టీ డాష్ బోర్డ్” యాప్ ద్వారా టీడీపీ చట్టవిరుద్ధంగా ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎంపీలు సత్యవతి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో కలిసి ఆయన గురువారం మధ్యాహ్నం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. పీపుల్స్‌ రిప్రజెంటేషన్‌ యాక్టును ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఘటనలను వారు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్నికల అధికారులతో భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్‌ డాట్‌ కామ్‌’ పేరిట ఆ పార్టీ వెబ్‌సైట్‌ కుట్రల్నిసెక్షన్‌ 123(3) పీపుల్స్‌ రిప్రజెంటేషన్‌ యాక్ట్‌ను ఉల్లఘిస్తున్న విషయానికి సంబంధించి ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్‌ప్రాక్టీస్‌పై అనేక అంశాల్ని కమిషన్‌తో సుదీర్ఘంగా చర్చించామని, వన్‌ సిటిజన్‌, వన్‌ ఓట్ అనే తమ పార్టీ సిద్ధాంతం గురించి వివరించామని ఆయన వెల్లడించారు.

ఎన్నికల కమిషన్‌ డ్యాష్‌బోర్టులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్‌ డాట్‌కామ్‌’లో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసు, కులంతోపాటు అతను సపోర్టు చేసే పొలిటికల్‌ పార్టీ, మొబైల్‌ నెంబర్‌ వంటి వివరాలున్న విషయాన్ని ఆధారాలతో సహా అందజేశామన్నారు. తెలుగుదేశం పార్టీ సేకరించిన ఈ ఓటర్‌ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్‌ పాయింట్‌ వద్ద స్టోర్‌ చేస్తున్నారని, అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్‌ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్‌ ద్వారా సేకరించడం అప్పట్లో ఆ యాప్‌పై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించిన విషయాన్ని విజయసాయి గుర్తు చేశారు.

- Advertisement -

టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌తో మరో కుట్ర

ఓటరు అంగీకారంతో సంబంధంలేకుండా ఓట్లను ఉంచాలా తొలగించాలా అనే సమాచారం కోసం తెలుగుదేశం పార్టీ మరో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుందని, టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌ డేటా మొత్తాన్ని లండన్‌లోని మరో సర్వర్‌లో స్టోర్‌ చేస్తూ ఉన్నారని ఎంపీ వివరించారు. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌పేరిట ఎన్నికల కమిషన్‌ డ్యాష్‌ బోర్టులో ఇమేజ్‌ ఫార్మేట్‌లో ఉన్న సమాచారాన్ని ఎక్సెల్‌ ఫార్మట్‌లోకి మార్చి ప్రతీ 30 ఓట్లకు తమ పార్టీకి చెందిన ఒక ఏజెంట్‌కు అప్పగిస్తారని, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగిలా, ఎన్నికల సంఘం సిబ్బంది మాదిరిగా తనకు కేటాయించిన 30 మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కులమేంటి? వాళ్ల పొలిటికల్‌ గుర్తింపేంటి? వారు ఏ రకమైన బెనిఫిట్స్‌ పొందుతున్నారు? వారు ఆరాధించే మతమేంటనే వివరాలతో ఓటర్ల వ్యక్తిగతమైన డేటాను సేకరించడమనేది చట్టవిరుద్ధమని మేము ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా వివరించామని విజయసాయి చెప్పారు.

‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరించడం ఆ పార్టీ మాల్‌ప్రాక్టీస్‌లో ఒకభాగమైతే 2024 నుంచి రాబోయే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనేది లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణ పత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులు అందచేసినట్లు మేము ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

4.36 లక్షల డూప్లికేట్‌ ఓట్లను గుర్తించాం…

ఓటర్ల పేర్లలో ఒకటో రెండో అక్షరాలను మార్పు చేసి వారు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లు పేర్కొంటూ ఓట్లు చేర్పించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను కూడా ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్‌ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల 36 వేల 268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్‌ ఓట్లుగా కనిపిస్తున్నాయని చెప్పారు.

తెలంగాణలో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు…

తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సెటిలర్స్‌  ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నిందని విజయసాయి మండిపడ్డారు. అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఓటర్ల చేర్పులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఆంధ్రప్రదేశ్‌లో వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని కూడా తాము ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చాం.

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల్ని ప్రోత్సహించరాదు

టీడీపీ ఎలక్షన్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ డూప్లికేటింగ్, డబుల్‌ ఎంట్రీస్, నాన్‌ లోకల్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10 లక్షల ఓట్లు ఉన్నట్లు, వాటిపై ఎంక్వైరీ చేయాలని గతంలో సీఈసీకి ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్‌లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే అందులో నిజం లేదని తేలిందని విజయసాయి వివరించారు. దీనినిబట్టి కోనేరు సురేష్‌ అనే వ్యక్తి ఎన్నికల సంఘం సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్ధం చేసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి విలువైన ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సమయాన్ని వృథా పరచడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాల్సిందిగా సీఈసీకి కోరామని ఆయన తెలిపారు. ఆధార్ సీడింగ్ చేస్తే ఎలాంటి దొంగ ఓట్లు అయినా తొలగించవచ్చనే విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకొచ్చామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement