Wednesday, May 8, 2024

Gujarat: గుజ‌రాత్ లో పిడుగుల‌తో భారీ వ‌ర్షాలు — 20 మంది మృత్యువాత

అహ్మాదాబాద్ – దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనేకచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 20 మంది మృత్యువాత పడ్డారు. దాహోద్‌ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు, అహ్మదాబాద్‌, అమ్రేలీ, సూరత్‌, సురేంద్ర నగర్‌, దేవ్భూమి ద్వారక, బనస్కాంత, బోతాడ్‌, ఖేదా, మెహసానా, పంచమహల్‌, సబర్కాంత ప్రాంతాల్లో ఒక్కరు చొప్పున పిడుగులు పడి మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి వంటి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కేవలం 16 గంటల్లో 50 నుంచి 117 మిమీ వాన నమోదైంది. ఈశాన్య అరేబియా సముద్రంపై తుఫాను సర్క్యులేషన్ ఉందని, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై దాని ప్రభావాన్ని విస్తరించిందని ఐఎండీ తెలిపింది.
గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షంతో పలువురు మృతి చెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement