Sunday, May 19, 2024

పర్యాటక రంగం ఐక్యత, సమగ్రతలను బలోపేతం చేస్తుంది: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యతనివ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో ఉన్న అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి, అక్కడి జీవన విధానాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి పర్యాటకాల వల్ల ప్రజల మధ్య సంస్కృతి, అభిప్రాయాల మార్పిడి జరిగి జాతి ఐక్యత, సమగ్రత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. “నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్” పేరిట ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో పర్యటించిన 18 రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మహిళలు సహా 75 మంది బైకర్లతో న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడు మంగళవారం సంభాషించారు.

ఇటీవలి తన ఈశాన్య రాష్ట్రాల పర్యటనను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, అందమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సంస్కృతి ఈశాన్య రాష్ట్రాలు పర్యాటక స్వర్గధామం అని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ రంగంలో భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాలను ఆయన అభినందించారు. వారు పాటించే ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకుని క్రమంగా స్థిరమైన సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రతి ఒక్కరూ మళ్ళాలని సూచించారు. ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రవాణా విషయంలో అభివృద్ధి గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో నూతన శకానికి నాంది పలికిందని గుర్తు చేశారు. భారతదేశంలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement