Wednesday, May 15, 2024

Tight Security – తుపాకీ నీడ‌లో అయోధ్య .. ఏడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు

22న అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగనుంది. దీని కోసం ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, బాబాలు ఇలా చాలా మంది వేడుకకు హాజరుకానున్నారు. దాదాపుగా 7వేల మంది విశిష్ట అతిధులు కార్యక్రమానికి హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే అయిదు నుంచి ఎనిమిది ల‌క్ష‌ల మంది భ‌క్తులు హాజ‌రుకానున్న‌ట్లు స‌మ‌చారం.. ప్రధాని మోదీతో పాటూ వీవీఐపీలు, సామ‌న్య భ‌క్త జ‌నం హాజరవుతున్న కారణంగా అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌.. అడుగడుగునా నిఘా
ఆకాశం నుంచి భూమి వరకు కట్టుదిట్టమైన నిఘా, భద్రతా ఏర్పాట్లు చేశారు. పైన డ్రోన్ల నుండి భద్రతా పర్యవేక్షణ చేయ‌నున్నారు… 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటూ ప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని కూడా పెద్ద సంఖ్యలో మోహరించనున్నారు. వీరి దగ్గర ఆటోమేటిక్ ఆయుధాలుంటాయని చెబుతున్నారు. ఎస్ పి జి నుండి ఎటిఎస్ వరకు ప్రత్యేక కమాండోలను తీసుకురానున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌మ‌న్వ‌యం..
సంపూర్ణ భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాల భద్రతా సంస్థలు కలిసి ఏడంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశాయి. మొదటి సర్కిల్‌లో ఆధునిక ఆయుధాలతో ఎస్‌పీజీ కమాండోలు.. రెండో సర్కిల్‌లో ఎన్ ఐఏ సిబ్బంది ఉంటారు. మూడో సర్కిల్‌లో ఐపీఎస్ అధికారులు భద్రతా బాధ్యతలు చేపట్టనున్నారు. నాల్గవ సర్కిల్‌కు సీఆర్‌పీఎఫ్‌ సైనికులు బాధ్యత వహిస్తారు. ఐదో సర్కిల్‌లో యూపీ ఏటీఎస్‌కు చెందిన కమాండోలు సిద్ధంగా ఉంటారు. ఆరో సర్కిల్‌లో ఐబీ సిబ్బంది, ఏడో సర్కిల్‌లో స్థానిక పోలీసు సిబ్బందిని నియమించనున్నారు.

యాంటీ డ్రోన్ సిస్ట‌మ్ రెడీ..
వైమానిక దాడిని ఎదుర్కోవటానికి యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ల నుండి కృత్రిమ మేధస్సుతో కూడిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ల వరకు అన్నిటినీ ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి సంరక్షణ కోసం 24 గంటలపాటు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 6 కంపెనీలు, పీఏసీకి చెందిన మూడు కంపెనీలు, ఎస్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన తొమ్మిది కంపెనీలు, ఏటీఎస్‌, ఎస్‌టీఎఫ్‌కు చెందిన ఒక్కో యూనిట్‌ను పెట్టినట్టు ఎస్పీ ప్రవీణ్‌రంజన్ తెలిపారు. వీరితో పాటు 300 మంది పోలీసులు, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బంది, 37 మంది లోకల్ ఇంటెలిజెన్స్, 2 బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ టీమ్‌లు, 2 యాంటీ సెబోటేజ్ స్క్వాడ్ టీమ్‌లను రప్పిస్తున్నారు. ఆలయానికి వెళ్లే అన్ని రహదారులు, కూడళ్లలో వారిని మోహరిస్తారు.

ప్ర‌ధాని భ‌ద్ర‌త‌కు స్నైప‌ర్‌ల ఏర్పాటు..
ప్రాణ ప్రతిష్ట చేయడానికి వస్తున్ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డీఐజీలు, 17 మంది ఎస్పీలు, 40 మంది ఏఎస్పీలు, 82 మంది డీఎస్పీలు, 90 మంది ఇన్‌స్పెక్టర్లతో పాటు 1000 మందికి పైగా కానిస్టేబుళ్లు, 4 కంపెనీ పీఏసీలు పీఎం సెక్యూరిటీ సర్కిల్‌లో పెట్టనున్నారు. వీటన్నిటితో పాటూ స్నిపర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరయూ నది ఒడ్డున స్నిపర్‌లను పెట్టనున్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీ ప్రశాంత్త్ కుమార్ తెలిపారు. అయోధ్యలో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద కార్యక్రమం జరగలేదని.. ఇప్పుడు జరిగేది దేశ చరిత్రలో నిలిచిపోయేదని అందుకే ఇంతలా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement