Monday, May 13, 2024

ఆ మ్యాచ్‌ల కోసం హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్లు.. వెల్లడించిన ఐసీసీ

టీ 20 ఫార్మట్‌లో మరో మెగా టోర్నమెంట్‌కు క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై టీ 20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 16వ తేదీ(ఆదివారం) నుంచే ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీని తిలకించేందుకు సిద్దమయ్యారు. పరిస్థితులు మెల్లి మెల్లిగా చక్కబడిన కారణంగా ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్‌లను వీక్షించేందుకు రానున్నారు. ఇప్పటికే 6 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మెగా టోర్నమెంట్‌ కోసం టీమ్‌ ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. మిగతా దేశాలు చేరుకుంటున్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్‌ వేడి రాజుకుంది.

ఈ నెల 16వ తేదీ నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. సూపర్‌ 12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఈ నెల 22వ తేదీ నుంచి సూపర్‌ 12 సమరం మొదలవుతుంది. సూపర్‌ 12లో ప్రధాన జట్లు పోటీపడతాయి. సూపర్‌ 12లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్‌ దక్కించుకునే అవకాశం ఉంటుంది. టీ 20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో ఏడు నగరాలు వేదికలుగా ఉన్నాయి. సూపర్‌ -12లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరుగనుంది. సిడ్నీ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ ఉంటుంది. సూపర్‌ 12 మ్యాచ్‌ల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను చూసేందుకు తాము వెంపర్లాడుతున్నామని ఐసీసీ టి 20 ప్రపంచకప్‌ చీఫ్‌ మిచెల్‌ ఎన్‌రైట్‌ అన్నారు. ప్రతీ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు రిలీజ్‌ చేయగానే అమ్ముడుపోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు భారీ డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. యుఏఇ, నెదర్లాండ్‌ మ్యాచ్‌తో పాటు శ్రీలంకతో నమీబియాతో తలపడే మ్యాచ్‌లకు తక్కువ సంఖ్యలో టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement