Friday, April 26, 2024

వామన్ రావు హత్య కేసు.. నివేదికపై హైకోర్టు సంతృప్తి!

తెలంగాణలో సంచలన సృష్టించిన లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసుల నివేదికపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈరోజు లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా… కేసు దర్యాప్తు స్థాయి నివేదికను పోలీసులు ధర్మాసనానికి సమర్పించారు. ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు ఏజీ ప్రసాద్ తెలిపారు. 32 మంది ప్రత్యక్ష సాక్షుల్లో 26 మంది వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు ఎఫ్ఎస్ఎల్​కి పంపించినట్లు తెలిపారు.

ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశముందని పేర్కొన్నారు. మే 17 నాటికి హత్య జరిగి 90 రోజులు కానుందని ఏజీ తెలిపారు. మే 17 నాటికి సమగ్ర ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉందన్నారు. పోలీసుల నివేదికలు తమకు ఇచ్చేలా ఆదేశించాలని వామన్ రావు తండ్రి తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. కాగా… వామన్ రావు తండ్రి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. పోలీసుల నివేదికలపై తాము సంతృప్తి చెందామన్న హైకోర్టు… పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపింది. సకాలంలో చార్జిషీట్ దాఖలయ్యేలా చూడటమే తమ ఉద్దేశ్యమన్న హైకోర్టు… తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement