Sunday, May 19, 2024

Delhi | టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారు.. వైసీపీపై సీఈసీకి ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్లే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నం ఆయన టీడీపీ లోక్‌సభ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులతో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలిశారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వైసీపీ తొలగిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. ఉన్న ఓట్లను తొలగించి అక్రమ ఓట్లను నమోదు చేస్తున్న వైనంపై ఫిర్యాదు జరపాలంటూ వినతిపత్రం సమర్పించారు.

ఎన్నికల కమిషనర్‌తో భేటీ అనంతరం రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. తాము ఫిర్యాదు చేయడానికి వస్తున్నామని తెలిసి తమ కంటే ముందే వచ్చి  వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారని విమర్శించారు. తాము ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించకుండా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. పది లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న ఫిర్యాదుపై స్పందన లేదని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని కనకమేడల తెలిపారు.

- Advertisement -

“వై ఏపీ నీడ్స్ జగన్” అనే కార్యక్రమం పూర్తిగా పార్టీ సంబంధిత కార్యక్రమమైనా దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తుండడంపై సీఈసీ దృష్టికి తీసుకొచ్చామని వెల్లడించారు. తమ ఫిర్యాదులపై ఈ నెల 22న రాష్ట్రానికి వస్తామని ఈసీ ఉన్నతాధికారులు చెప్పారని ఆయన వివరించారు. తప్పు చేసిన వాళ్లు సవ్యంగా ఉన్నాయని చెబుతుంటే ఇంకేం చెప్పాలని ప్రశ్నించారు. తాము ఏ ఫిర్యాదు ఇస్తామో వారికి ముందే తెలుసునని, కాబట్టి తాము ఏం ఫిర్యాదు చేస్తామో కూడా వారికి తెలుసునని రవీంద్రకుమార్ ఎద్దేవా చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement