Friday, May 24, 2024

Big story | డిండీ ఎత్తిపోతల పనుల్లో వేగం.. 3.41 ఎకరాలకు సాగునీరు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: కొండలను సరిహద్దులుగా చేసుకుని భూగర్భ సొరంగాలను ఈదు కుంటూ పరవళ్లు తొక్కేందుకు దక్షిణ తెలంగాణలోని రిజర్వాయర్ల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నెల చివరిలోగా వట్టెం వెంకటాద్రి జలాశయం, జూలై చివరిలోగా కర్వెన,ఎదుల,వట్టెం,నార్లాపూర్‌ జలాశయాలు సిద్ధం కానున్న నేపథ్యంలో ఈ జలాశయాల అనుబంధ జలాశయాల పనులపై సాగునీటి పారుదల శాఖ దృష్టి సారించింది.సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో పెండింగ్‌ లో ఉన్న డిండీ ఎత్తిపోతల పథకం పై ఇరిగేషన్‌ శాఖ దృష్టి సారించింది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు 2007లో సమైక్యపాలకులు అసమగ్రంగా డీపీఆర్‌ ను సిద్ధం చేసి పెండింగ్‌ లో పెట్టిన డిండీ ఎత్తిపోతల పథకం ఫైళ్ల బూజును ప్రభుత్వం దులిపి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సమాంతరంగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు ప్రారంభించింది.

అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదుచేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లాంటి సమస్యలతో పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యం అయ్యాయి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిండీ పైదృష్టి సారించడంతో పనులు వేగం పుంజుకున్నాయి. పాలమూరురంగారెడ్డి రిజర్వాయర్‌లో అంతర్భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నుంచి డండీ కి నీటిని ఎత్తిపోసి ముగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో భూ ఉపరితల జలాలతో ప్లోరైడ్‌ ను శాశ్వతంగా తరిమివేసేందుకు డిండీ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పనచేసింది. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా 3.41 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటుగా 83గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిండీ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది.

- Advertisement -

నిత్యం తాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కృష్ణా బ్యాక్‌ వాటర్‌ నుంచి రోజుకు 0.5 టీఎం సీలు 60 రోజులు ఏదుల రిజర్వాయర్‌ లో ఎత్తిపోసి అక్కడి నుంచి డండీ కి ఎత్తిపోస్తారు. అలాగే అత్యవసరమైతే నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి కూడా నీటిని తోడే అవకాశాలను కూడా నీటిపారుదల శాఖ పరిశీలిస్తోంది. డిండీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ. 6వేల 194 కోట్ల పరిపాలనా పరమైన అనుమతిని ప్రభుత్వం ఇవ్వడంతో పాటుగా తొలివిడత నిధులను కూడా విడుదల చేసి నిర్మాణ పనులు చేపట్టారు. తెలంగాణ ఆవిర్భవించగానే 12 జూన్‌ 2015లో సీఎం కేసీఆర్‌ మర్రిగూడ మండలం, శివన్న గూడెం లో ఈ ప్రాజెక్టు పనులకు అంకురార్పణ చేశారు. ఇక్కడి నుంచి 93 కిలోమీటర్‌ ప్రధాన కాల్వ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నల్గొండజిల్లాలో 3లక్షల 9 వేల 950 ఎకరాలకు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 31వేల 550 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పనచేశారు.

93 కిలోమీటర్ల ప్రధాన కాలవద్వారా అనుబంధ రిజర్వాయర్లను నిర్మించి దేవరకొండ పరిధిలో 24వేల 300ల ఎకరాలు, చందంపేట మండలంలో 12వేల 20 ఎకరాలు, చింతపల్లి మండలంలో 29వేల 985 ఎకరాలు, మునుగోడు మండలంలో 24వేల 515ఎకరాలు చందూరు మండలంలో 31వేల 685 ఎకరాలు, నాంపల్లి మండలంలో 49వేల ఎకరాలు, మర్రి గూడెం మండలంలో 2వేలు, సంస్థాన్‌ నారాయణపురం మండలంలో 22వేల ఎకరాలకు నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని గుర్రంపోడు, మహబూబ్‌ నగర్‌ జిల్లోని వెలిదండ, మాడ్గులపల్లి,అచ్చంపేట, వంగూరు, ఉప్పు నూతన మండలాలకు సాగునీరు తాగునీరు అందించాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలవేగం పెంచింది. అయితే దక్షిణ తెలంగాణకు జీవధారగా మారనున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని అనేక జలాశయాలు మరో రెండునెల్లో పూర్తి కావస్తున్‌ నేపథ్యంలో డిండీ ఎత్తిపోతలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement