వాజేడు, ( ప్రభన్యూస్): ములుగు జిల్లాలోని చిట్టచివరి ప్రాంతం అయిన వాజేడు మండలాభివృద్ధికి కావల్సినన్ని ఫండ్స్ రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్కు వినతి అందింది. ఏటూరునాగారం మండలంలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ కు వాజేడు జడ్పీటీసీ పుష్పలత ఇవ్వాల (ఆదివారం) వినతి పత్రం అందజేశారు. గుమ్మడిదొడ్డి 163 జాతీయ రహదారి నుండి వాజేడు మీదుగా ఎడ్జర్లపల్లి గ్రామం దాకా దాదాపు 16 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు.
అదేవిధంగా కృష్ణాపురం వద్ద మోడీకుంట సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, గోదావరి వరదల కారణంగా అనేక గ్రామాల్లో రోడ్లు ధ్వంసం కాగా, కొత్తగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అదేవిధంగా వరద ముంపు గ్రామాల్లో బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రంలో పొందుపరిచారు. ఏజెన్సీ మండలమైన వాజేడుకు మరిన్ని నిధులు కేటాయించి గిరిజనులను ఆదుకోవాలని కోరారు.