Thursday, May 9, 2024

Rajya Sabha Elections – గుజ‌రాత్ లో నామినేష‌న్ వేసిన విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్

గాంధీన‌గ‌ర్ – రాజ్యసభకు జరిగే ఎన్నికల కోసం గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దీని కోసం ఆయన నేడు గాంధీనగర్ కు చేరుకున్నారు. సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తో కలిసి రాష్ట్ర అసెంబ్లీ సముదాయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారి రీటా మెహతాకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీ నాయకత్వానికి, గుజరాత్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ నాలుగేళ్ల క్రితం రాజ్యసభలో గుజరాత్ కు ప్రాతినిధ్యం వహించే గౌరవం లభించింది. గత నాలుగేళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో జరిగిన మార్పుల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం నాకు లభించింది. రాబోయే 4 సంవత్సరాలలో జరిగే పురోగతికి దోహదం చేయగలనని నేను ఆశిస్తున్నాను.’’ అని అన్నారు. పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ రాష్ట్రంగా గుర్తింపు పొందిన గుజరాత్ కు ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని జైశంకర్ అన్నారు. మళ్లీ ఇక్కడి నుంచే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

పొరుగు దేశాలతో భారత్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి సమాధానమిస్తూ.. గత తొమ్మిదేళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలతో గొప్ప పురోగతి సాధించామని చెప్పారు. వాణిజ్యం, కనెక్టివిటీ పెరిగిందని, సంబంధాలు మెరుగయ్యాయని, భద్రత కోణంలో కూడా మెరుగుదల కనిపించిందని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని సురక్షితంగా ఉంచగలదని తాను విశ్వసిస్తున్నానని జైశంకర్ అన్నారు.

కాగా.. గోవా, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రాష్ట్రాలకు చెందిన పది మంది సభ్యులు జూలై, ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ఖాళీగా ఉన్నఈ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడానికి జూలై 13 చివరి తేదీ అని ఈసీ తెలిపింది. జులై 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement