Saturday, April 27, 2024

Congress Josh – ఇక కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు జోరందుకుంటాయి …. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసల ఫ్లో మొదలవుతుందని చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో భట్టి విక్రమార్కతో సమావేశం అయ్యారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరులో కాంగ్రెస్ సభ ఖమ్మం సభను మరిపించేలా ఉంటుందని అన్నారు. ప్రజల ఏం కోరుకుంటున్నారో దానిని నెరవేర్చడమే తమ అజెండా అని అన్నారు.

వ్యక్తిగత పదవుల కోసం తాను కానీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కానీ పని చేయడం లేదని అన్నారు. బీఆర్ఎస్‌‌తో పాటు అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రావడానికి పలువురు సిద్దంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పీసీసీ, ఐఐసీసీ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఈ నెలాఖరు నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫ్లో మొదలవుతుందని అన్నారు. కాంగ్రెస్‌లో చేరే నేతల సంఖ్య రెండు అంకెల్లో ఉంటుందని అన్నారు. కేసీఆర్ ను గద్దెదించే వరకూ తమ పోరాటం సాగుతుందని చెప్పారు.
ప్రధాని మోడీ పర్యటనను కేసీఆర్ నిజంగా బహిష్కరించిందా? బహిష్కరించినట్టుగా నటించారా? అనేది ప్రజలకు తెలుసునని.. అది త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు. మోడీ, కేసీఆర్‌ల మధ్య నువ్వు కొట్టినట్టు చేయి.. నేను ఏడ్చి నట్టు చేస్తా అనే బంధం ఉందని విమర్శించారు.

తాను ఇటీవల ఏపీ సీఎంవో కార్యాలయానికి వెళ్లానని అయితే సీఎం జగన్‌ను కలవలేదని చెప్పారు. సీఎంవోలోని అధికారులను కలిశానని తెలిపారు. దేశంలోని నాలుగైదు రాష్ట్రాల్లో తనకు వ్యాపారాలు ఉన్నాయని.. అందులో ఏపీలో కూడా ఉందని.. అందుకే సీఎంవోలోని అధికారులను కలవడం జరిగిందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద ఆలోచన లేదనే స్పష్టత వారికి ఉందన్నారు. వైఎస్ షర్మిల అంశం తన పరిధిలోనిది కాదని చెప్పారు. ఆమె చేరిక విష‌యం అధిష్టానం చూసుకుంటుద‌ని తెలిపారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తమ ముందు ఉన్న లక్ష్యం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement