హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జోడో పాదయాత్ర రెండో విడత మక్తల్ నుంచి ఉదయం 6:30 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. మక్తల్ నుంచి ఎలిగండ్ల వరకు 26 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. అందుకు బుధవారం సాయంత్రమే ఢిల్లి నుంచి హైదరాబాద్కు రానున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మక్తల్కు చేరుకోనున్నారు. తిరిగి మక్తల్లోని 11/22 కేవీ సబ్స్టేషన్ నుంచి రాహుల్గాంధీ యాత్రను ప్రారంభించి.. కన్యాకపరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్రోడ్డు, కాచ్వార్ మీదుగా జక్లేర్ చేరుకున్నాక మధ్యాహ్నా భోజనం చేస్తారు. ఆ తర్వాత యాత్రకు విరామం ఇచ్చి.. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు యాత్రను ప్రారంభిస్తారు. జక్లేర్ ఎక్స్రోడ్, గుడిగండ్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో రాహుల్గాంధీ మాట్లాడనున్నారు. కార్నర్ మీటింగ్ తర్వాత ఎలిగండ్లలోని బాలాజీ ఫ్యాక్టరీ సమీపంలో బస చేయనున్నారు.
కాగా, ఈ నెల 23న కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలోని గూడబల్లూర్ గ్రామంలోని కృష్ణానదీ వంతెన మీదుగా రాష్ట్రంలోకి రాహుల్యాత్ర ప్రవేశించింది. అక్కడి నుంచి గూడబల్లూరులోని టై రోడ్ జంక్షన్ వరకు 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అక్కడనే కార్నర్ మీటింగ్ నిర్వహించారు. దిపావళీ పండుగ, ఏఐసీసీ అధ్యక్షులుగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతల స్వీకారానికి హాజరయ్యేందుకు పాదయాత్రకు మూడు రోజుల విరామం ఇచ్చి ఢిల్లికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఢిల్లికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు..
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మల్లిఖార్జున ఖర్గే బుధవారం స్వీకరించనుండటంతో.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లికి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యతో పాటు మాజీ సీఎల్పీ జానారెడ్డి, మండలిలో విపక్ష నేతలకు పార్టీ అధిష్టానం నుంచి ఆహ్వానం పంపడంతో వారు ఢిల్లిdకి వెళ్లారు. పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మంగళవారం మల్లిఖార్జున ఖర్గేను ఢిల్లిdలోని ఆయన నివాసంలో కలిసి అభినందించారు.