Tuesday, May 7, 2024

రాజకీయాలకతీతంగా రాష్ట్రాల అభివృద్ధి.. అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లికి నివాళులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయాల కృషికి నిరంతరం కృషి చేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం న్యూఢిల్లీలోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకుని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలతో నివాళులర్పించారు. పక్కనే ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. భవన్ ప్రాంగణంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులందుకున్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను జరుపుతున్నామని చెప్పారు. ఇటీవలే సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిచామని, కేంద్ర మంత్రులు స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా జరిపే ఈ వేడుకలను తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, 168 మంది ఎంపీలు తెలంగాణ కోసం ఓటు వేశారని ఆనాటి పరిస్థితులను కేంద్రమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం తోడ్పాటునందిస్తోందని, భవిష్యత్‌లో కూడా పూర్తి మద్ధతు కొనసాగుతుందని ఆయన భరోసానిచ్చారు. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహిస్తున్న వేడుకల్లో కేంద్రమంత్రులతో పాటు, తెలుగు వారంతా పాల్గొంటారని వెల్లడించారు.

తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని చెప్పుకొచ్చారు. తెలంగాణలోని పేదవారికి రూ.3 చొప్పున ఐదు కిలోల బియ్యం, కరోనా నేపథ్యంలో మరో ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి లక్షా నాలుగు కోట్లు కేటాయించామని, రైతుల సంక్షేమం, ఆస్పత్రుల అభివృద్ధితో పాటు నరేగా ద్వారా ఉపాధి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సహకారం… ఇలా అవసరాన్ని బట్టి తెలంగాణకు నిధులిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు 20వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామన్న ఆయన, తెలంగాణ అభివృద్ధికి భారత ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, సబ్ కా సాత్- సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్ నినాదంతో ముందుకు సాగుతున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement