Tuesday, May 14, 2024

Delhi | రేపు ప్రతిపక్షాలకు ధీటుగా ఎన్డీయే భేటి.. కూటమిలోకి కొత్త పార్టీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని గద్దె దించడమే లక్ష్యంగా ఐక్యతా రాగం వినిపిస్తున్న ప్రతిపక్షాలకు ధీటుగా బీజేపీ కూడా ఎత్తులు వేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో చిన్న పార్టీలను సైతం కలుపుకుంటూ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం కీలకంగా మారింది. మొత్తం 38 రాజకీయ పార్టీలు ఈ భేటీలో పాల్గొంటాయని బీజేపీ జాతీయాధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం ప్రకటించారు.

మంగళవారం సాయంత్రం గం. 5.00కు అశోక హోటల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓబీసీలు, దళితులు, గిరిజన ఆదీవాసీల్లో పట్టున్న చిన్న పార్టీలను కలుపుకుంటూ బీజేపీ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కూటమిలో బీజేపీ తర్వాత పెద్ద దిక్కులా వ్యవహరించిన శిరోమణి అకాలీదళ్, తెలుగుదేశం వంటి పార్టీలకు ఆహ్వానం అందలేదు. లోక్ జనశక్తి (రాంవిలాస్) చిరాగ్ పాశ్వాన్, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుశ్వాహా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముకేశ్ సహానీతో పాటు శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), జనసేన, అన్నా డీఎంకే వంటి పార్టీలకు ఆహ్వానం అందింది.

- Advertisement -

కూటమిలోకి కొత్త పాత మిత్రులు

ఎన్డీయేను బలోపేతం చేసే క్రమంలో కమలనాధులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టిన బీజేపీ, ఈసారి వ్యూహం మార్చినట్టు స్పష్టమవుతోంది. 5 శాతం కంటే తక్కువ ఓటుబ్యాంకు కల్గిన చిన్న పార్టీలను కూడా బీజేపీ అక్కున చేర్చుకుంటోంది. తద్వారా ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే 1-2 శాతం ఓట్ల వ్యత్యాసాన్ని భర్తీ చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో అప్నాదళ్ ఇప్పటికే ఎన్డీయే కూటమిలో ఉండగా.. ఇప్పుడు తాజాగా ఓబీసీ నేత రాజ్‌భర్‌ను తమ శిబిరంలోకి చేర్చుకుంది. ఇప్పటి వరకు సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టిన సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భర్‌ను ఆకట్టుకోవడం ద్వారా ఓబీసీ వర్గాల్లో కొత్త ఓటుబ్యాంకును జమచేసుకున్నట్టయింది. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న ఓబీసీల్లో పట్టు సాధించడం ద్వారా బలాన్ని పెంచుకునే వ్యూహంతో ముందుకెళ్తున్న బీజేపీ, ఆ దిశలోనే ఆయా వర్గాల్లో పట్టున్న పార్టీలపై కన్నేసింది.

ప్రాంతీయంగా బలంగా ఉన్న పెద్ద పార్టీలతో పెట్టుకుంటే సీట్ల సర్దుబాటులో సింహభాగం ఆ పార్టీలకే ఇవ్వాల్సి వస్తోంది. పైగా బీజేపీ బలాన్ని ఆ పార్టీలు ఉపయోగించుకుని రాష్ట్రాల్లో అధికారాన్ని సాధిస్తూ, తమను సొంతంగా ఎదగకుండా అడ్డుకుంటున్నాయన్న భావన కూడా కమలనాథుల్లో ఉంది. సుదీర్ఘకాలంగా పంజాబ్‌లో అకాలీదళ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలతో చేసిన చెలిమి ఉభయకుశలోపరిగా మిగల్లేదని గ్రహించింది. మహారాష్ట్రలో శివసేన(చీలికకు ముందు) నుంచి దూరమయ్యాక, బిహార్‌లో జేడీ(యూ)తో తెగదెంపులు చేసుకున్న తర్వాతనే బీజేపీ తన సొంత బలాన్ని పెంచుకోగలిగందనే విశ్లేషణ కూడా ఉంది. అదే చిన్న పార్టీలతో జట్టుకడితే సీట్ల సర్దుబాటులోనూ సమస్య ఉండదని, పైగా ఇరువురికీ ప్రయోజకారిగా పొత్తుల ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తోంది.

బిహార్‌లో పాత కొత్త మిత్రపక్షం లోక్‌జనశక్తి (రాంవిలాస్)ను ఎన్డీయే గూటిలోకి తీసుకొచ్చింది. రాంవిలాస్ పాశ్వాన్ బ్రతికున్నప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత పార్టీలో చీలిక ఏర్పడగా, పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి ఎన్డీయేలో కొనసాగగా, చిరాగ్ పాశ్వాన్ దూరమయ్యారు. దళిత, బహుజన వర్గాల్లో గట్టి పట్టున్న లోక్ జనశక్తిని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఆయా వర్గాల ఓట్లు చీలకుండా చూడాలని బీజేపీ చూస్తోంది. మొత్తంగా అమిత్ షా మంత్రాంగం ఫలించి చిరాగ్ ఎన్డీయే గూటికి దగ్గరయ్యారు. మంగళవారం నాటి ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి హాజరయ్యే ముందు సోమవారం అమిత్ షా తో కూడా విడిగా భేటీ అయ్యారు.

ఎన్డీయే గూటిలోకి జేడీ(ఎస్)?

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ ఆత్మపరిశీలన చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తమ ఓటుబ్యాంకులో పెద్దగా మార్పు లేకపోయినా.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఏకంగా 5-6 శాతం పెరగడం వల్ల భారీ విజయం నమోదు చేయగలిగింది. అయితే కాంగ్రెస్ పొందిన ఈ అదనపు ఓటుబ్యాంకు ఆ రాష్ట్రంలో దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) కోల్పోయినట్టు గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా జేడీ(ఎస్) బలహీనపడడం కాంగ్రెస్‌కు కలిసొచ్చిందని గ్రహించింది. ఈ పరిస్థితుల్లో జేడీ(ఎస్)తో జట్టుకట్టడం ద్వారా రెండు పార్టీలకూ ఉపయోగకరంగా ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. సోమవారం జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ.. విపక్షాలు జేడీ(ఎస్)‌ను తమ భాగస్వామిగా భావించలేదని, విపక్షాల మహాకూటమిలో జేడీ(ఎస్) చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్డీయేలో ఆ పార్టీ భాగం కాబోందనే అనుమానాలకు ఊతమిస్తోంది. ఎన్డీయే తమను ఎలాంటి సమావేశానికీ ఆహ్వానించలేదని చెప్పిన కుమారస్వామి, ఇప్పటికిప్పుడు కాకపోయినా సార్వత్రిక ఎన్నికల నాటికి రెండు పార్టీలూ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు నేల నుంచి జనసేన మాత్రమే

బీజేపీతో మళ్లీ దోస్తీ కోరుకుంటున్న తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆహ్వానం అందకపోయినా.. ఆ పార్టీని కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ బీజేపీ అధిష్టానం వద్ద గతంలో ప్రతిపాదన తీసుకొచ్చిన జనసేనకు ఆహ్వానం లభించింది. సోమవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పార్టీలో నెంబర్ 2 గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. నేతలిద్దరూ సెంట్రల్ ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో బస చేశారు. మంగళవారం సాయంత్రం ఎన్డీయే సమావేశం మొదలయ్యేలోగా బీజేపీలో పలువురు పెద్దలను నేతలిద్దరూ కలవనున్నారు.

ఎన్డీయే భేటీ తర్వాత కేబినెట్ విస్తరణ!

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ పునర్వ్యవస్థీకరిస్తారనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే రేపు, మాపు ఉంటూ ఊరిస్తూ వచ్చిన మంత్రివర్గ విస్తరణ అంశం గత కొద్ది రోజులుగా తెరమరుగైంది. ఇప్పుడు ఎన్డీఏ భేటీ సందర్భంగా మళ్లీ చర్చ మొదలైంది. ఈసారి విస్తరణలో ఎన్డీయే మిత్రపక్షాలకు పెద్దపీట వేస్తూ కూటమిని బలోపేతం చేయాలని భావిస్తున్నారని, ఆ క్రమంలో ఎన్డీఏ భేటీ తర్వాత విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement