Monday, May 13, 2024

Delhi | దేశభక్తితోనే దేశ ప్రగతి.. ఢిల్లీలో ఉత్సాహంగా తిరంగా బైక్ ర్యాలీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆగస్టు 15 రోజు దేశవ్యాప్తంగా ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇలా ప్రతిచోటా జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి ర్యాలీల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యులై జాతీయ భావనను ప్రదర్శించాలని ఆయన కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్ జెండా ఊపి తిరంగా ర్యాలీ ప్రారంభించారు.

ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీసంఖ్యలో కేంద్రమంత్రులు, ఎంపీలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైన తిరంగా బైక్ ర్యాలీ ప్రగతి మైదాన్ టన్నెల్ – ఇండియా గేట్ సర్కిల్ గుండా సాగి మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం గేట్ నంబర్ 1 వద్ద ముగిసింది. వ్యక్తిగత అభిప్రాయాలు, కుల, మత, ప్రాంత అభిప్రాయ భేదాల కన్నా జాతీయ భావనే అత్యుత్తమమైనదని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్ అన్నారు.

ప్రతి ఒక్కరూ నా దేశమనే భావనతో పని చేసినప్పుడు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పియూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, మీనాక్షి లేఖితో పాటు పలువురు ఎంపీలు, బీజేవైఎం కార్యకర్తలు, ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement