హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కేవలం పెట్టుబడుల్లోనే కాదు.. ఐటీ ఆవిష్కరణలు, ఎగుమతుల్లో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ, దేశానికే ఆదర్శంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే సరికొత్త సాంకేతిక వ్యవస్థను అతిత్వరలనే ఆవిష్కరించనుంది. అన్ని రకాల ప్రయాణాలకు బహుళ ప్రయోజనాలను అందించేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులను తీసుకువచ్చి మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
తొలి దశలో రాజధాని హైదరాబాద్ మహానగరం సహా అన్ని మెట్రో నగరాల్లో అమలు చేయనున్నారు. సక్సెస్ అయిన తర్వాత జిల్లా కేంద్రాలు, పట్టణాల వరకు విస్తరించనున్నారు. మెట్రో, ఆర్టీసీ, క్యాబ్.. ఇకపై ఏ వాహనం ఎక్కినా ఒకే కార్డు వినియోగించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మెట్రో రైలు, టీఎస్ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటో సర్వీసులను అనుసంధానిస్తూ కామన్ మొబిలిటీ కార్డు అందుబాటులోకి రానుంది.
ప్రయాణం మరింత సులభతరం
మొబిలిటీ కార్డు సక్సెస్ అయితే ఎంఎంటీఎస్, క్యాబ్స్, షేర్ ఆటోలు, రిటైల్ సంస్థలకు ఈ సేవలను విస్తరిస్తామని ఐటీ శాఖ ప్రకటించింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు అందుబాటు-లో ఉన్న ఇతర నగరాల్లో ఈ కార్డును వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రయాణానికి మాత్రమే కాకుండా ఇతర లావాదేవీలకు ఈ కార్డు ఉపయోగపడేలా మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్డును ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు, చర్యలు కొనసాగుతున్నాయి.