Saturday, April 27, 2024

ఈడీ కస్టడీలో కవిత.. ఆ ఆరుగురిని కలిసేందుకు అనుమతి

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. నిన్న (శుక్రవారం) రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లింది. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. 7 రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 23వతేదీ వరకు ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్‌లో కవితను విచారించనున్నారు. అయితే కస్టడీ సమయంలో కవితకు కొన్ని స్పెషల్ సదుపాయాలు కల్పించనున్నారు. కవిత పెట్టుకున్న అభ్యర్థనకు కోర్టు అనుమతిస్తూ.. ఈడీకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

కవితకు బుక్స్, స్టేషనరీతో పాటు ఆమె కళ్లద్దాలు అందించాలని ఈడీ అధికారులకు కోర్టు సూచించింది. ఆమె కోరుకునే బంధువులు, లాయర్లను కలిసి మాట్లాడేందుకు అనుమతించాలని ఆదేశించింది. రోజూ సాయంత్రం 6 నుంచి 7 మద్యలో ఆమె భర్త అనిల్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, శరత్, శ్రీధర్, ప్రణీత్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని ఈడీ అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కవితను విచారించాలని.. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. న్యాయవాదిని కలిసేందుకు కూడా కవితను అనుమతించాలని చెప్పింది.

మరోవైపు.. అరెస్ట్ సమయంలో, కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో కవితకు హైబీపీ ఉండటంతో.. ఆమెకు ఎప్పటికప్పుడూ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలని సూచించారు. ప్రతిరోజు మెడికల్ టెస్టులు చేయాలని చెప్పారు. ఇక.. వీటితో పాటు ఆమె దుస్తులు, భోజనం ఇంటి నుంచి పంపించేలా అనుమతించింది న్యాయస్థానం. అనంతరం.. 23వ తేదీన 12 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement