Thursday, May 2, 2024

జై భీమ్ సీన్ రిపీట్‌.. చేయని నేరం ఒప్పుకోవాల‌ని ద‌ళిత మ‌హిళపై చిత్ర హింస‌లు!

జై భీమ్ సినిమాలో ద‌ళితుల‌పై అక్ర‌మ కేసులు పెట్టి.. చేయ‌ని నేరం ఒప్పుకోవాల‌ని పోలీసులు ఎలా చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. అది సినిమా రీల్ కాగా.. రియ‌ల్ లైఫ్ లో కూడా జైభీమ్ త‌ర‌హాలో రీల్ సీన్ రిపీట్ అయింది. చేయ‌ని నేరం ఒప్పుకోవాల‌ని ఓ ద‌ళిత మ‌హిల‌ను పోలీసులు అరెస్టు చేసి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. వివ‌రాల్లోకి వెళితే.. చిత్తూరు జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఇంటి పనిమనిషిగా చేసిన దళిత మహిళ ఉమా మహేశ్వరిపై అక్రమ దొంగతనం కేసు నమోదు చేశారు. వేణుగోపాల్ రెడ్డి ప్రమేయంతో దళిత మహిళను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. చేయని దొంగతనం ఒప్పుకోవాలంటూ దళిత మహిళపై చేసిన కస్టోడియల్ టార్చర్ పై 24.01.2022న తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించింది. దళిత మహిళపై చిత్రహింసలను తీవ్రంగా పరిణిస్తున్నామని కమీషన్ పోలీసులను హెచ్చరించింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు చూస్తుంటే బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల మానవ హక్కులు తీవ్ర ఉల్లంఘనలకు గురైనట్లు కనిపిస్తున్నాయని కమీషన్ పేర్కొంది. ఐజీ స్థాయి అధికారితో స్వతంత్ర విచారణ చేపట్టి నాలుగు వారాల్లో నివేదిక పంపాలని డీజీపీకి కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్.హెచ్.ఆర్.సి ఈ స్థాయిలో తీవ్రంగా స్పందిచి డీజీపీకి నోటుసులు జారీ చేయడం ఇదే తొలిసారి.

దళిత మహిళను చితకబాదిన పోలీసులు..

దళిత మహిళ ఉమా మహేశ్వరిని పోలీసులు చితకబాదినట్లు బాధితురాలు తెలిపింది. చేయని నేరం ఒప్పుకోవాలని అరికాళ్లపై, వెణ్ణులో లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె తెలిపింది. నేరం చేయలేదని ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా వదలలేదని ఉమా మహేశ్వరి తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement