Monday, May 13, 2024

రాజీవ్ గాంధీ హంత‌కులు న‌ళిని,ర‌విచంద్ర‌న్ ల‌కు నిరాశ – పిటిష‌న్ కొట్టివేసిన హైకోర్టు

రాజీవ్ గాంధీ హంత‌కులు న‌ళిని, ర‌విచంద్ర‌న్ ల‌కు నిరాశ ఎదురైంది. త‌మ‌ని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ ఆమోదంతో సంబంధం లేకుండా తమను విడుదల చేయాలంటూ నళిని, రవిచంద్రన్ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారి, జస్టిస్ ఎన్. మాలా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రాజీవ్ హత్య కేసులో నళిని, రవిచంద్రన్ జీవితఖైదు అనుభవిస్తున్నారు. వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, అయితే ఆ అధికారాలు హైకోర్టుకు ఉండవని సీజే మునీశ్వర్ నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదే కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న పెరారివలన్ ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని నళిని, రవిచంద్రన్ తమ పిటిషన్లలో ఉదహరించారు. పెరారివలన్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన మేరకు, గవర్నర్ రాష్ట్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కాబట్టి, తమను విడుదల చేసేలా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఆర్ షణ్ముగసుందరం వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గవర్నర్ విధులను స్పష్టంగా నిర్వచించిందని, ఈ వ్యవహారంలో గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని తీర్పు వెలువరించిందని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు హైకోర్టుకు కూడా అధికారాలు ఉన్నాయని భావిస్తున్నామని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement