Sunday, May 5, 2024

కరుగతున్న ఐస్​ లాండ్..పెరగనున్న భూతాపం..

రోజు రోజుకీ వాతావరణంలో వస్తున్న మార్పులతో భూమిపై ఉన్న మంచు వేగంగా కరిగిపోతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. 20 ఏళ్లలో ఏకంగా 750 చదరపు కిలోమీటర్ల మేర ఐస్ లాండ్ లో మంచు కరిగిపోయింది. అంటే ఐస్ లాండ్ లో 7 శాతం ఐస్ నీళ్లలా మారిపోయింది. ఐస్ లాండ్ సైంటిఫిక్ జర్నల్ జోకల్ అధ్యయనంలో తేలిన విషయమిది. 2019 నాటికి 10,400 చదరపు కిలోమీటర్లకు ఐస్ లాండ్ మంచు కుదించుకుపోయిందని పేర్కొంది. భూతాపం ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఉదాహరణ ఇది. 1890 నుంచి ఇప్పటిదాకా 2,200 చదరపు కిలోమీటర్ల మంచు కరిగిపోయిందని, అందులో మూడో వంతు 2000వ సంవత్సరం తర్వాతే కరిగిందని వెల్లడించింది. ఈ 20 ఏళ్లలో కరిగిన మంచు ఐస్ లాండ్ లోని అతిపెద్ద మంచు కొండ అయిన హాఫ్జోకల్ కు దాదాపు సమానమని తెలిపింది.

2014లో ఒక్జోకల్ అనే గ్లేసియర్ (హిమనీ నదం)ను ఆ హోదా నుంచి సైంటిస్టులు తప్పించారు. రెండేళ్ల క్రితం ఆ గ్లేసియర్ మొత్తం కరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.2 లక్షల హిమనీ నదాలుండగా.. అందులో చాలా వరకు వేగంగా కరిగిపోతున్నాయని ఇటీవలి నాసా పరిశోధనల్లో తేలింది. సముద్ర మట్టాల పెరుగుదలలో వాటి నీరే ఐదో వంతు (20%) అని తేల్చారు. 2000 నుంచి 2019 మధ్య ఏటా 26,700 కోట్ల టన్నుల మంచు కరిగినట్టు నాసా టెరా ఉపగ్రహ చిత్రాల ద్వారా తేలింది. 2000 నుంచి 2004 మధ్య ఏటా 22,700 కోట్ల టన్నుల మంచు కరిగితే.. అదే 2015 నుంచి 2019 మధ్య ఏటా 29,800 కోట్ల టన్నుల మంచు కరిగినట్టు తేలింది. ఈ స్థాయిలో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, సముద్రతీర ప్రాంతాలు వరద ప్రభావానికి గురైతున్నట్లు వెల్లడించారు. దీంతో తీరప్రాంతాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయని పరిశోధకులు హెచ్చరించారు. మంచు ఇంత వేగంగా కడుగుతుంటే పర్యావరణంలో ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement