Friday, May 3, 2024

యోగీ ఎవరో తెలీదు, సీబీఐతో చిత్ర రామకృష్ణ.. సహకరించడం లేదన్న సీబీఐ

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సీఈఓ చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్టు చేసింది. కో-లొకేషన్‌ స్కాంలో ఆమెను ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఆ తరువాత అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన మరుసటి రోజు సీబీఐ ప్రశ్నించి.. అరెస్టు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ మేరకు చిత్రా అరెస్టు విషయంలో సీబీఐ కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ డేటా సెంటర్‌లో ఒక స్టాక్‌ బ్రోకర్‌ సర్వర్‌ కో-లొకేషన్‌కు సంబంధించిన కేసులో చిత్ర రామకృష్ణను ఢిల్లిdలో అరెస్టు చేసినట్టు ప్రకటించింది. వైద్య పరీక్షల అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆమెను తీసుకెళ్లినట్టు తెలిపింది. ఈ కేసులో ఇంతకుముందే చిత్ర రామకృష్ణతో పాటు పలువురిని ప్రశ్నించిన విషయాన్ని సీబీఐ గుర్తు చేసింది. చిత్రా తరఫు న్యాయవాది దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

త్వరలో మరిన్ని అరెస్టులు!

ఈ కేసులో మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో చిత్ర రామకృష్ణను ప్రభావితం చేసిన గుర్తు తెలియని హిమాలయ యోగి పాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఈ హిమాలయ యోగి పాత్ర నిజమా.. లేక కల్పితమా.. అనే అంశంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం ఆమెను 14 రోజుల కస్టోడియల్‌ విచారణకు అనుమతించాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. విచారణకు చిత్ర సహకరించడం లేదని, హిమాలయ యోగిని గుర్తు పట్టేందుకు ఆమె నిరాకరిస్తున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. సోమవారం ఆమెను ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ తమ వాదనలు వినిపించింది. చిత్ర రామకృష్ణ, ఆమె మాజీ సలహాదారు ఆనంద్‌ సుబ్రమణియన్‌ మధ్య దాదాపు 2500 ఈ-మెయిళ్లు నడిచినట్టు గుర్తించామన్నారు.

చిత్ర రామకృష్ణ అరెస్టు

హిమాలయ యోగిగా అనుమానిస్తున్న సుబ్రమణియన్‌ను గుర్తు పట్టేందుకు చిత్ర గుర్తుపట్టేందుకు నిరాకరించారని సీబీఐ తెలిపింది. మూడు రోజుల పాటు విచారించి.. ఆదివారం చిత్రను అరెస్టు చేశామని వివరించింది. విచారణలో ఏ ప్రశ్నకు కూడా ఆమె సరైన రీతిలో సమాధానం ఇవ్వలేదని తెలిపింది. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఆనంద్‌ సుబ్రమణియనే అదృశ్య హిమాలయ యోగి అని సీబీఐ వర్గాలు సీబీఐ అధికారులు ఇటీవల వెల్లడించాయి. 2013-16 మధ్య చిత్రా రామకృష్ణన్‌ సమాచారం పంచుకున్న ఈ-మెయిల్‌ ఐడీని సుబ్రమణియన్‌ సృష్టించినట్టు ఆ వర్గాలు ధ్రువీకరించాయి. కొన్ని మెయిళ్లు ఆనంద్‌కు చెందిన మరో మెయిల్‌ ఐడీ కూడా మార్క్‌ చేసి ఉందని, వీటి స్క్రీన్‌ షాట్స్‌ ఆనంద్‌ మెయిల్‌ ఐడీల నుంచి రికవరీ చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆమెను 14 రోజుల కస్టోడియల్‌ విచారణకు కోరగా.. కోర్టు 7 రోజుల కస్టోడియల్‌ విచారణకు అనుమతిచ్చింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement