Tuesday, May 14, 2024

Delhi | ఘనంగా స్వాతంత్ర్య సమరయోధులు మొగిలయ్య గౌడ్ వర్థంతి సభ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మరుగునపడిన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు పెట్టడమే కాక వారి కుటుంబాలకూ న్యాయం చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులు తూళ్ళ వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యుషన్ క్లబ్‌లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తులు బత్తిని మొగిలయ్య గౌడ్ వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, ఎంపీ లక్ష్మణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలకులు ఎంతోమంది సమర యోధుల చరిత్ర తెలియకుండా చేశారన్నారు. దేశంలో నెహ్రూ కుటుంబం, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ చరిత్రే చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మజ్లిస్ ఒత్తిడికి లోబడి నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన వారి చరిత్ర మరుగున పడేలా చేశారని ఆయన ఆరోపించారు. నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన బత్తిని మొగిలయ్యకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశ రాజధానిలో ఘన నివాళి అర్పించామని వివరించారు. సమాజానికి వన్నె తెచ్చిన వారికి బీజేపీ సరైన గుర్తింపు ఇస్తుందన్నారు. రజాకార్ల పోకడలను కళ్ళకు కట్టేలా సినిమా తీస్తున్న రజాకర్ సినిమా బృందాన్ని లక్ష్మణ్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement