Thursday, April 25, 2024

గ్రేటర్ లో 175 శిథిల భవనాల కూల్చివేత

నగరంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పురాతన, శిథిల భవనాలను తొలగించేందుకు సహకరించాలని జిహెచ్ఎంసి నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే నగరంలో శిథిల భవనాల తొలగింపు, మరమ్మతులు చేపట్టడంతో పాటు ఆయా యజమానులకు నోటీసులు కూడా జారీచేశామని తెలిపింది. నోటీసులు జారీచేసినప్పటికీ ఇంకా శిథిల భవనాలను ఖాళీ చేయకపోవడం, తొలగించకపోవడం వల్ల వర్షాలతో కూలి ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉన్నందున వెంటనే వాటిని తొలగించుకోవాలని జిహెచ్ఎంసి కోరింది. ప్ర‌స్తుత వ‌ర్ష‌కాల సీజన్ లో న‌గ‌రంలో ఉన్న శిథిల భ‌వ‌నాలను కూల్చివేయ‌డం, మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌డం, సీజ్ చేసే ప‌నుల‌ను జీహెచ్ఎంసీ ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక విభాగం విస్తృతంగా చేపట్టింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో 610 శిథిల భ‌వ‌నాలు ఉన్నాయ‌ని ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక విభాగం గుర్తించింది. ఈ సంవత్సరం జూన్ 26వ తేదీ నుండి ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటి వరకు 175 శిథిల భవనాలను కూల్చివేయగా మరో 84 భవనాలకు మరమ్మతులు చేయించారు. 2020 లో 231 శిథిల భవనాలను కూల్చివేయగా 129 భవనాలకు మరమ్మతులు, సీజ్ చేయడం జరిగింది. వ‌ర్ష‌కాలంలో విప‌త్తుల నివార‌ణ‌లో భాగంగా శిథిల భ‌వ‌నాల‌ను గుర్తించ‌డం, శిథిల‌, పురాత‌న భ‌వ‌నాల ప‌టిష్ట‌త‌, భ‌ద్ర‌త‌పై ఇంజ‌నీరింగ్ విభాగాల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన భ‌వ‌నాల‌ను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం ఈ కార్యాచ‌ర‌ణను చేప‌ట్టగా, ఈ శిథిల‌, ప్ర‌మాద‌క‌ర‌మైన భ‌వ‌నాల‌లో ఉన్న నివాసితులు ఖాళీ చేయ‌డానికి నిరాక‌రిస్తుండ‌డంతో వారికి కౌన్సిలింగ్‌ను చేప‌డుతున్నారు. అదేవిధంగా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉన్న భ‌వ‌నాల స‌మీపంలోకి ఎవ‌రూ వెళ్ల‌కుండా ఉండేందుకు ఆయా భ‌వ‌నాల చుట్టూ భారీ కేడ్ల‌ను అమ‌ర్చ‌డం జ‌రుగుతుంది.

కాగా ప్ర‌మాద‌క‌రంగా ఉన్న శిథిల భ‌వ‌నాలు వ‌ర్షాల వ‌ల్ల కూలి ప్రాణ న‌ష్టం సంభ‌వించే ప్ర‌మాదం ఉన్నందున ఈ భ‌వ‌నాల ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న నివాసితులు త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు హెచ్చ‌రించారు. కాగా 2017 సంవ‌త్స‌రంలో 199 శిథిల భ‌వ‌నాల‌ను కూల్చివేయగా 15 భ‌వ‌నాల‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింది. 2018లో 182 శిథిల భ‌వనాల‌ను కూల్చివేయ‌గా 26 భ‌వ‌నాల‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింది. వీటితో పాటు 2019 జ‌న‌వరి నుండి జూన్ 11వ తేదీ వ‌ర‌కు 382 అన‌ధికార భ‌వ‌న నిర్మాణాల‌ను కూల్చివేయ‌గా 129 ప్రాంతాల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేశారు. 2017లో 373 అక్ర‌మ నిర్మాణాల‌ను, 227 ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేశారు. 2018లో 554 అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేయ‌గా ర‌హ‌దారులు, ఫుట్‌పాత్‌ల‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేసిన‌ట్టు జీహెచ్ఎంసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement