Thursday, May 2, 2024

Delhi: ఖర్గేకు కరీంనగర్ కానుక.. అగ్గిపెట్టె శాలువాతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సత్కారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గేను కరీంనగర్ కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ అగ్గిపెట్టె శాలువాతో సత్కరించారు. బుధవారం మధ్యాహ్నం ఖర్గేను ఆయన నివాసంలో కలిసిన పొన్నం ప్రభాకర్ తెలంగాణలోని సిరిసిల్లలో పట్టుదారంతో చేనేత మగ్గాలపై నేసిన శాలువాను అగ్గిపెట్టెలో పెట్టి తీసుకొచ్చారు. సిరిసిల్ల చేనేత నైపుణ్యాన్ని చాటడంతో పాటు కొత్త అధ్యక్షుడిపై అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

ఆయనతో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ సురేశ్ శెట్కార్ కూడా ఉన్నారు. ఖర్గే నాయకత్వంలో, గాంధీ పరివారం దిశానిర్దేశంతో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కలసికట్టుగా పనిచేస్తామని వారు తెలిపారు. ‘భారత్ జోడో’ యాత్ర గురువారం నుంచి తెలంగాణలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో సాయంత్రానికి ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు శాలువాతో మల్లికార్జున ఖర్గేను సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement