Monday, May 6, 2024

National : ద్వారకలో అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం..

గుజరాత్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. దేవభూమి ద్వారక ఆదిత్య రోడ్డులో ఉన్న ఓ అపార్ట్ మెంట్‌ మొదటి అంతస్తులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి ఉండటం మరింత విషాదం నింపుతోంది.

- Advertisement -

ఎయిర్ కండీషనర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేక గదిలో ఉన్న వాళ్లందరూ అగ్నికి ఆహుతయ్యారు.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు స్పాట్ కు చేరుకుని మంటలు చెలరేగిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి, అతని భార్య, ఎనిమిది నెలల కుమార్తె, మరో వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే అలర్ట్ అయిన రెస్క్యూ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్న ఓ మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడడం విశేషం.

ఏసీని నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల హీట్ ఎక్కువ అయ్యి ఎయిర్ కండీషనర్ పేలిందని, దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతులు పవన్ ఉపాధ్యాయ్, అతని భార్య తిథి, కుమార్తె ధ్యాన్, తల్లి భవానీ బెన్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement