ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో దారుణం చోటుచేసుకుంది..పదిహేడేళ్ల అమ్మాయి సరదాగా జీన్స్ వేసుకుందని తన బంధువులే కొట్టిచంపారు. ఉత్తర్ప్రదేశ్ దేవరియా జిల్లాలో ఈనెల 19న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహువాదీహ్ ప్రాంతంలోని గ్రామానికి చెందిన బాలిక.. కొన్నాళ్లుగా పంజాబ్లోని లుథియానాలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమె తండ్రి అక్కడే ఉద్యోగం చేసేవారు. ఆయన మృతి అనంతరం ఇటీవల తల్లితో కలిసి సొంత గ్రామానికి తిరిగొచ్చింది. బాలిక గ్రామంలో జీన్స్ ధరిస్తుండటం కుటుంబ పెద్దలకు ముఖ్యంగా తాత, మామలకు నచ్చడం లేదు. జీన్స్ వేసుకోవద్దని వారు చెప్పినా బాలిక వినలేదు. వారికి ఎదురు పడకుండా ఎక్కువ సమయం ఇంటి బయటే ఉంటూ వచ్చింది. దీనిపై సోమవారం బాలికకు, పెద్దలకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను గోడకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని నదిలో తోసేయాలనుకున్నారు. కానీ, వంతెనకు చిక్కుకుని మృతదేహం వేళ్లాడుతూ ఉండిపోయిందని డియోరియా పోలీస్ చీఫ్ శ్రీపతి మిశ్రా చెప్పారు. విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో తాత పరమన్స్ పాసవాన్ను అరెస్టు చేయగా, మామలు వ్యాస్, అరవింద్లతో పాటు మిగిలిన బంధువుల కోసం గాలిస్తున్నారు.
ఇది కూడాచదవండి: గోదావరిలో చిక్కుకున్న స్వామీజీలు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు