Monday, May 20, 2024

దేశ సంపద నిర్మాణంలో ఇంజనీరింగ్‌ కాంట్రాక్టర్లదే కీలక పాత్ర : బోయినపల్లి వినోద్‌ కుమార్‌.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశ సంపద నిర్మాణంలో ఇంజనీరింగ్‌ కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. కాంట్రాక్టర్లుకు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగాల అధికారుల మధ్య పారదర్శకత , సామర్యం ఉండాలని ఆయన సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇంజనీరింగ్‌ కాంట్రాక్ట్స్‌ – అవాయ్‌ డెన్స్‌ ఆఫ్‌ డిస్ప్యూట్‌ ఫర్‌ హోర్మోనియస్‌ గ్రోత్‌ అనే అంశంపై సదస్సు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కాంట్రక్టర్లు ఇంజనీరింగ్‌ విభాగాల మధ్య సఖ్యత సరైన అవగాహన లేకపోతే వివాదాలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లు, వంతెనల వంటి నిర్మాణంలో ఇంజినీరింగ్‌ కాంట్రాక్టర్లు ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్‌ విభాగాల అధికారుల మధ్య పక్కా ప్రణాళికతో కూడిన అవగాహన ఉంటే అభివృద్ధి పనులు సాఫీగా మందుకు సాగుతాయని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత నిర్మాణ రంగమే పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోందన్నారు. ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పారదర్శకత, అగాహన లోపించిన కారణంగా దేశవ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువచేసే వివాదాలు వివిధ న్యాయస్థానాలలో కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ఇంజనీరింగ్‌ అధికారులతో అవగాహనకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సదస్సులో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, కార్యదర్శి వెంకట సుబ్బయ్య, కాళేశ్వరం నీటి పారుదల చీఫ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వర్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఆర్బిట్రేటర్స్‌ తెలుగు రాష్ట్రాల ఛైర్మన్‌ మోతే శ్రీధర్‌, కార్యదర్శి ప్రదీప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement