Friday, July 26, 2024

TS | యాదాద్రి భక్తులకు డ్రెస్‌ కోడ్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి చేస్తూ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం తాజాగా ఆదివారం నిర్ణయించింది.

వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన జూన్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. కాగా.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తున్నారు.

హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. నిత్య కల్యాణం, హోమం, జోడు సేవ, శ్రీసుదర్శన నరసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని నిబంధన విధించారు.

టీటీడీ తరహాలోనే.. నియమాలు

తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తుల వీఐపీ బ్రేక్‌ దర్శనానికి డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి చేసింది. స్వామివారి విరామ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని, అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనానికి క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉందని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కరరావు తెలిపారు. జూన్‌ 1 నుంచి ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగా ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశుని క్షేత్ర ప్రాధాన్యతను తెలియజేసేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, బోర్డుపై క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే వివరాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement