Saturday, April 27, 2024

పైసా ఖర్చు లేకుండా, రూపాయి లంచం లేకుండా డబుల్‌ ఇళ్లు : మంత్రి హ‌రీష్ రావు

సంగారెడ్డి : కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంత‌రం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హైద‌రాబాలోని గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయ‌న్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లు చూసారా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని స్పష్టం చేసారు. ఖాళీ జాగా ఉన్న వారికి ఇండ్లు నిర్మంచుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మాజీమంత్రి గీతారెడ్డి హయాంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు, వైద్య సేవలు అందించడంలో, బూస్టర్ డోస్ ఇచ్చే విషయంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో (ప్రథమ స్థానంలో )టాప్ లో నిలిచిందన్నారు. అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, వైద్యులు, వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు.

సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ‌లో మంచి వైద్యాన్ని, విద్యను అందిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి రైతులకు రైతు బంధు డబ్బులు జ‌మ ఖాతాలో వేసి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నట్టు వంటి సంక్షేమ పథ‌కాలు ఎక్కడ లేవని స్పష్టం చేశారు. కోహీర్ లో 10 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నాం, ఆసుపత్రిని రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తెనున్నాం, త్వరలో సంగమేశ్వర, బస వేశ్వర సాగునీరు ప్రాజెక్ట్ లతో గోదావరి జలాలను జహీరాబాద్ తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటిని అందిస్తాం అన్నారు. తెంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది, మీ కోసం ఎవరు పని చేస్తున్నారో మీరే గుర్తించాలి అన్నారు. కహీర్ మండలంనకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.46.25 కోట్ల చెక్కులను అందజేశారు. లబ్ధిదారులకు ఇండ్ల క‌ట్టి పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ బీబీ పాటిల్,ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పాల్గొన్నారు.


ఏఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్ల‌ను అభినందించిన మంత్రి…
జహీరాబాద్ దిగ్వాల్ పిహెచ్‌సీలో నూతనంగా నిర్మించిన ఓపీ బ్లాక్ ప్రారంభించిన ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆశ, ఏఎన్ఎం లతో ముచ్చటించిన గర్భిణీలకు అందిస్తున్న పోషికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 86% ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్న విషయాన్ని తెలిపారు. దీంతో మంత్రి ఏఎన్ఎం, ఆశా వర్కర్లను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లనే మీ పై పని భారం అవుతుందని మంత్రి ఈ సందర్బంగా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement